ఐటీ చెల్లించని వారికి శుభవార్త: రిటర్న్స్ దాఖలు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్ దాఖలు చేయని వారికి శుభవార్త. ఆడిట్ రిపోర్ట్, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది సీబీడీటీ. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) సోమవారం ప్రకటన చేసింది.
ఐటీ రిటర్న్ దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును 31 అక్టోబరు 2018 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కొన్ని ప్రత్యేక విభాగాలకు చెందిన పన్ను చెల్లింపుదారులకు ఈ అవకాశం వర్తిస్తుందని తన ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు ఆడిట్ రిపోర్టు పరిశీలన తుది గడువును కూడా అక్టోబరు 31 వరకు పొడిగించినట్లు ప్రకటించింది.
ఐటీ రిటర్న్ దాఖలు గడువును పెంచడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 2017-18(అసెస్మెంట్ ఇయర్ 2018-19)కి గాను ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి మొదట ఆగస్ట్ 31 వరకు పొడిగించారు.
ఆ తర్వాత మరోసారి తేదీని పొడిగించి సెప్టెంబరు 30కి పొడిగించారు. ఆ తర్వాత ఆ తేదీని అక్టోబరు 15 వరకు పొడిగించిన సీబీడీటీ, తాజాగా మరోసారి పదిహేను రోజులు పెంచింది. అక్టోబరు 31 వరకు గడువు ఇచ్చింది.