ప్రతిష్ఠంభనకు తెర?: శివసేనకు బయట నుంచి బిజెపి మద్దతు
బ్రుహన్ ముంబై నగర పాలక సంస్థ (బీఎంసీ) పాలక మండలి ఎన్నికల్లో తమతో కారాలు మిరియాలు నూరుతున్న మిత్రపక్షం శివసేన.. ప్రభుత్వం నుంచి వైదొలిగేందుకు అవకాశం ఇవ్వరాదని బిజెపి నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ: బ్రుహన్ ముంబై నగర పాలక సంస్థ (బీఎంసీ) పాలక మండలి ఎన్నికల్లో తమతో కారాలు మిరియాలు నూరుతున్న మిత్రపక్షం శివసేన.. ప్రభుత్వం నుంచి వైదొలిగేందుకు అవకాశం ఇవ్వరాదని బిజెపి నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
తద్వారా తమ వైరిపక్షం కాంగ్రెస్ పార్టీకి అనుకూల పరిస్థితులు తలెత్తకుండా చూడాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బీఎంసీ పాలక మండలి ఎన్నికల్లో శివసేనకు బయట నుంచి మద్దతునివ్వాలని బిజెపి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు సాధించిన ఉత్సాహంతో ఉన్న బిజెపి వైఖరిలో మార్పు స్పష్టంగా కాన వస్తున్నది. బీఎంసీలో 227 స్థానాలకు గాను శివసేన 84, బీజేపీ 82 స్థానాలు గెలుచుకుని సమ ఉజ్జీలుగా నిలిచాయి. కానీ పాలక మండలి ఏర్పాటుకు పూర్తి మెజారిటీ కావాలంటే 114 మంది కార్పొరేటర్లు కావాలి.
ఆధిపత్యం కోసం శివసేన
1994 నుంచి బిజెపితో కలిసి ప్రయాణం సాగిస్తున్న శివసేన.. ఆధిపత్యం కోసం తహతహలాడుతున్నది. అందులోభాగంగానే బీఎంసీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసింది. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లు దాదాపు ఇరు పార్టీలకు సమాన స్థానాలు రావడంతో శివసేనకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా మేయర్ పదవి కోసం అవసరమైతే కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకునేందుకు సిద్ధమని సంకేతాలిచ్చింది. అందుకు గతానుభవాలను పరిగణనలోకి తెచ్చింది.
Uddhav Thakery
మోదీ తదితరులతో భేటీ తర్వాత మారిన ఫడ్నవీస్
ఈ పరిస్థితుల్లో దేశ రాజధాని ‘హస్తిన'కు వచ్చిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. ప్రధాని నరేంద్రమోదీ, నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. బీఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఇరు పక్షాలు కలిసి కాపురం చేయక తప్పదని పేర్కొన్న సంగతి తెలిసిందే.
Nitin Gadkari with Fadnavis
మేయర్ పైనే ప్రధాన చర్చ
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో 90 నిమిషాల సేపు జరిగిన సమావేశంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఫడ్నవీస్ వివరించారని తెలుస్తోంది. ప్రత్యేకించి బీఎంసీ ఎన్నికల్లో ప్రతిష్ఠంభనపై సవివరంగా చర్చించారని సమాచారం. మేయర్ ఎన్నిక గురించి కూడా చర్చించారని తెలియవచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో అసహజమైన పొత్తులకు తెర తీయొద్దని, ఆ అవకాశాలు కల్పించొద్దని ఫడ్నవీస్కు నరేంద్రమోదీ స్పష్టం చేశారని వినికిడి.
Modi, Fadnavis
సేన సహజ భాగస్వామి అన్న మోదీ
శివసేన వ్యక్తిగత కారణాలతో విభేదించినా సహజ భాగస్వామిగా కొనసాగించాలని హితవు చెప్పినట్లు తెలుస్తున్నది. దీనర్థం దూకుడుగా వ్యవహరిస్తున్న శివసేనను క్షమించడం కాదని, కాంగ్రెస్ పార్టీకి అనవసర అవకాశాలు కల్పించకుండా ముందుకు వెళ్లాలని ఫడ్నవీస్కు మోదీ హితవు చెప్పారని ఆయన సన్నిహిత వర్గాల కథనం. గత ఎన్నికల్లో 31 కార్పొరేటర్లకు మాత్రమే పరిమితమైన బీజేపీ.. ఈ దఫా అనూహ్యంగా 82 కార్పొరేటర్లకు దూసుకెళ్లింది.
Modi
థాకరే, అరుణ్ గావ్లీ కీలకం
బీఎంసీ పాలక మండలి ఎన్నికల్లో రాజ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన, అరుణ్ గావ్లీ ఆధ్వర్యంలోని అఖిల భారతీయ సేన (ఎబిఎస్) కింగ్ మేకర్లుగా వ్యవహరించనున్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్కు ఏడు, ఎబిఎస్కు ఒక స్థానం లభించాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెన్నెస్, ఎబిఎస్ వివిధ రకాల ఆప్షన్లను ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. ఆయా పరిస్థితులను బట్టి ఈ రెండు పార్టీలు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే స్వతంత్ర కార్పొరేటర్ల మద్దతుతో తమ బలం 89 స్థానాలకు చేరుకున్నదని శివసేన వాదిస్తున్నది.
Raj Thakery, Arun Glavi