హాంగ్కాంగ్లో నీరవ్ మోడీ: అరెస్టుపై భారత్కు తేల్చేసిన చైనా
బీజింగ్/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్కు సుమారు 13,500కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ నగల వ్యాపారి నీరవ్ మోడీని హాంగ్కాంగ్లో ఉంటున్నట్లు భారత్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే చైనాతోపాటు పలు దేశాలకు నీరవ్ మోడీని తమకు అప్పగించేందుకు సహకరించాలని కోరింది.
ఈ క్రమంలోనే భారత్ రాసిన లేఖపై చైనా తాజాగా స్పందించింది. స్థానిక చట్టాలు, ఇరు దేశాల మధ్య ఒప్పందాలకు అనుగుణంగా హాంకాంగ్.. నీరవ్ మోడీ అరెస్ట్ పై నిర్ణయం తీసుకుంటుందని చైనా తెలిపింది.
అలాగే, నీరవ్ మోడీని అరెస్ట్ చేసే విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తుందని వెల్లడించింది. అయితే, ఇప్పటికే హాంగ్ కాంగ్ పోలీసులు నీరవ్ మోడీని అరెస్ట్ చేసినట్లు పలు మీడియా ఛానళ్లు వార్తలను ప్రసారం చేశాయి. మరికొద్ది రోజుల్లోనే నీరవ్ మోడీని భారత్కు తీసుకొచ్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని పేర్కొన్నాయి.
నీరవ్, ఛోక్సీలకు నాన్ బెయిలబుల్ వారెంట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం కేసుకు సంబంధించి నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సిలకు ముంబైలోని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం బెయిలుకు వీలుకాని వారెంట్లు జారీ చేసింది. దర్యాప్తునకు సహకరించాల్సిందిగా వారిద్దరి అధికారిక ఈమెయిల్ ఐడీలకు సీబీఐ సమాచారం పంపించగా వ్యాపార, ఆరోగ్య కారణాలు చూపించి నిరాకరించారు.
ఇప్పుడు బెయిలుకు వీలు కాని వారెంట్లు జారీ చేయడంతో ఇంటర్పోల్ నుంచి రెడ్కార్నర్ నోటీసులు జారీ చేయవచ్చు. నీరవ్ మోడీ హాంకాంగ్లో ఉన్నాడని గుర్తించామని, అతని తాత్కాలిక అరెస్టు కోసం విజ్ఞప్తి పంపించామని ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసిన విషయం తెలిసిందే.