వ్యాపమ్: మెడికల్ కాలేజీ డీన్ అనుమానాస్పద మృతి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో కలకలం సృష్టించిన వ్యవసాయక్ పరీక్షా మండల్ (వ్యాపమ్) కుంభకోణంలో మరో అనుమానాస్పద మృతి చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రత్యక్షంగానో, పరోక్షంగా సంబంధం ఉన్న పలువురు అనుమానాస్పద స్ధితిలో మరణించిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో కీలకసాక్షి కుటుంబాన్ని ఇంటర్యూ చేసిన అక్షయ్ సింగ్ అనే విలేకరి ఆకస్మికంగా మృతి చెందారు. ఆజ్తక్ ఛానల్లో పని చేస్తున్న ఆయన నాలుగేళ్లుగా ఈ స్కామ్ను వెలికి తీస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కుంభకోణంలో నిందితులు, సాక్షులు అయినవారిలో దాదాపు 47 మంది అనుమానాస్పద స్థితిలో మరణించారు.
తాజాగా జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్ శర్మ ఢిల్లీలోని ఆదివారం ఉదయం ఢిల్లీలోని హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తోన్న ఉన్నతాధికారుల బృందంలో సభ్యుడు. ఢిల్లీలోని ఎయిర్ పోర్టుకు సమీపంలోని హోటల్లో తన గదిలో విగతజీవిగా పడి ఉన్న ఆయనను హోటల్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
మృతదేహం పక్కనే కొన్ని మందులతోపాటు మద్యం సీసాను గుర్తించామని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అరుణ్శర్మ కంటే ముందు ఆ కళాశాలకు డీన్గా పని చేసిన డాక్టర్ సాకెల్లి కూడా జూన్ 4న మరణించారు.
ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఇదే అంశంపై మీడియాతో మాట్లాడారు. వ్యాపమ్ కుంభకోణాన్ని సీబీఐ చేతికి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. ఇందులో ఎక్కువ మంది అధికారపార్టీ నాయకులు, వ్యాపారులు, రిక్రూట్మెంట్ మాఫియా, దళారులు ఉన్నారు. ఈయనకు కూడా ఈ స్కామ్తో సంబంధం ఉందని, డబ్బులు తీసుకు ఉద్యోగాలు ఇప్పించారని సమాచారం.
అయితే ఈ కేసుకి సంబంధించిన వారు ఇలా అనుమానాస్పద స్ధితిలో చనిపోతున్నారో అర్ధం కావడం లేదు. పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నాయి.