నిప్పంటించుకుని వైద్య కళాశాల డీన్ ఆత్మహత్య
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల డీన్గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి శుక్రవారం ఉదయం ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వైద్య కళాశాలకు డీన్గా వ్యవహరిస్తున్న డాక్టర్ డికె షకాల్యే తన అధికారిక నివాసంలోనే ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నరనేదానిపై కారణాలు తెలియరాలేదు. ఆయన భార్య మార్నింగ్ వాక్ కోసం బయటికి వెళ్లిన సమయంలో షకాల్యే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిప్పంటించుకున్న తర్వాత ఆ బాధ తాళలేక బయటికి వచ్చి సాయం కోసం అరిచారు.
దీంతో గమనించిన చుట్టు పక్కలవాళ్లు మంటలు ఆర్పి, ఆయనను హుటాహుటాని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన 90శాతం కాలిపోవడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆరు నెలల క్రితం కళాశాల డీన్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ షకాల్యే.. గత 20 రోజులుగా సెలవులో ఉన్నారు.
ఆయన ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నట్లుగా కనిపించేవారని షకాల్యే సహోద్యోగులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన మెడికల్ ఎంట్రాన్స్ ఎగ్జామినేషన్స్లో కుంభకోణం వెలుగు చేసిన తర్వాత షకాల్యే పనిచేస్తున్న కళాశాలకు చెందిన 90 మంది విద్యార్థులు బహిష్కరణకు గురయ్యారు. అయితే షకాల్యే ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు జరిపిన తర్వాతే ఏమైనా వివరాలు వెల్లడించగలమని చెప్పారు.