కర్ణాటక బ్రేకింగ్ న్యూస్.. తొందరపడకండి!: బీజేపీకి ప్రకాశ్ రాజ్ పరోక్ష కౌంటర్
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-బీజేపీ మధ్య ఇప్పుడెంత రసవత్తర పోరు నడుస్తుందో.. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కి, కాషాయ పార్టీకి మధ్య కూడా గత కొంతకాలంగా అలాంటి పోరే నడుస్తోంది. జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య తర్వాత నుంచి ప్రకాశ్ రాజ్ ప్రధాని మోడీపై 'జస్ట్ ఆస్కింగ్' పేరుతో వరుస ప్రశ్నలు గుప్పిస్తూ వస్తున్నారు.
తాజాగా కర్ణాటకలో యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసినవేళ.. ప్రకాశ్ రాజ్ పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రకాశ్ ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా... చివరకు బీజేపీనే గెలిచిందంటూ ఆ పార్టీ మద్దతుదారులు ఆయనకు కౌంటర్ ఇచ్చారు.
Karnataka..Breaking NEWS...Dear political parties...and politicians....don’t be in a HURRY and DESPERATE to develop a state..first prove your worth ..who ever you are ...on the floor tom evening at 4pm. Be DEMORATIC....🙏🙏👏👏👏
— Prakash Raj (@prakashraaj) May 18, 2018
SUPREME COURT IS SUPREME
అయితే క్షణక్షణానికి మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం నిలబడుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గవర్నర్ వజుభాయ్ వాలా బలనిరూపణకు ఇచ్చిన 15రోజుల గడువును సుప్రీంకోర్టు రేపటికే కుదించడంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది.
రేపు సాయంత్రం 4.30గం.కి కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం బలనిరూపణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ బీజేపీకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
'కర్ణాటక.. బ్రేకింగ్ న్యూస్.. ప్రియమైన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులారా.. రాష్ట్రాన్ని వెంటనే అభివృద్ధి చేసేయాలని తొందరపడకండి. ముందు మీరేంటో?, మీ బలం ఎంతో రేపు సాయంత్రం 4 గంటలకు నిరూపించుకోండి. సుప్రీం కోర్టు.. సుప్రీంగా వ్యవహరించింది' అంటూ ఓ ట్వీట్ ద్వారా ఆయన వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.
ప్రకాశ్ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో ఓటు హక్కు కూడా లేని నీవు.. ఇక్కడి రాజకీయాలపై ఎందుకు కామెంట్ చేస్తున్నావంటూ ఓ నెటిజెన్ ప్రకాశ్ రాజ్ ను ప్రశ్నించడం గమనార్హ:. ఏదేమైనా బలనిరూపణకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉండటంతో.. కర్ణాటక రాజకీయాల వైపే దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.