బాలికపై రేప్, హత్య: ఉరి శిక్ష, మీడియా, లాయర్లపై రాళ్ల దాడి, పోలీసు తుపాకి లాక్కొని !
బెంగళూరు: బాలిక మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన కామాంధుడికి బెంగళూరు నగర శివార్లలోని రామనగర సెషన్స్ కోర్టు ఉరి శిక్ష విధించింది. ఉరి శిక్ష పడటంతో కామాంధుడు మీడియా, లాయర్ల మీద రాళ్లతో దాడి చేసి పోలీసు తుపాకి లాక్కొని కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు.
బాలికను వెంబడించి !
2012 ఆగస్టు 15వ తేదీ తావరకెరెలో నివాసం ఉంటున్న హీనాకౌర్ (9) అనే బాలికను బీడీలు తీసుకురావాలని ఆమె తండ్రి బయటకు పంపించాడు. హీనాకౌర్ పక్కింటిలో నివాసం ఉంటున్న సలీం అనే కామాంధుడు బాలిక హీనాకౌర్ ను వెంబడించి అత్యాచారం చేశాడు.
23 మంది సాక్షం
బాలిక విషయం బయటకు చెబుతుందని భయంతో సలీం ఆమెను దారుణంగా హత్య చేశాడు. బాలిక శవం స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేశారు. బాలికను సలీం వెండించాడని, ఆమెను పిలుచుకుని వెళ్లాడని ఆ సందర్బంలో చూసిన 23 మంది సాక్షుల దగ్గర పోలీసులు వాగ్మూలం తీసుకున్నారు.
ఉరి శిక్ష కరెక్టు
ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశోదనలో హీనాకౌర్ మీద సలీం అత్యాచారం చేశాడని వెలుగు చూసింది. కేసు విచారణ చేసిన రామనగర 3వ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణ రై బాలిక మీద అత్యాచారం చేసినందుకు 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 50 వేలు జరిమానా, బాలికను హత్య చేసినందుకు సరైన శిక్ష ఉరి శిక్ష అంటూ బుధవారం తీర్పు చెప్పారు.
కేసు వాదించలేదని !
కోర్టులో నుంచి బయటకు వచ్చిన సలీం తన కేసు ఎవ్వరూ వాదించలేదని, మీడియా రాద్దాంతం చేసిందని బూతులు తిడుతూ చేతికి చిక్కిన రాళ్లు తీసుకుని మీడియా, న్యాయవాదుల మీద దాడి చేశాడు, భద్రత కోసం వచ్చిన పోలీసుల దగ్గర ఉన్న తుపాకి లాక్కొని కాల్పులు జరపడానికి ప్రయత్నించడంతో సలీంను పోలీసులు చితకబాది జైలుకు తరలించారు.