నిర్భయ ఘటనలు జరిగితే ఏం చేయమంటారు.. ఉరిశిక్ష అమలుపై కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ : దేశంలో ఉరిశిక్షను అమలు చేయాలని అన్నిరాష్ట్రాలు కోరుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దాదాపు 90 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సుముఖుంగా ఉన్నాయని పేర్కొంది. ఈ అంశంపై శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు.
అయితే ఈ అంశంపై మరోసారి రాష్ట్రాల అభిప్రాయం తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే ఓ వ్యక్తిని చంపాలని ఏ సమాజం కోరుకోదని .. కానీ అలాంటి సమాజంలో నిర్భయ లాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే పొరపాటున అమాయకులు ఉరిశిక్ష పడే అవకాశం లేదని పేర్కొన్నారు. అలా పడిన రాజ్యాంగం విశేష అధికారాలు కల్పించిందని గుర్తుచేశారు. కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, గవర్నర్, రాష్ట్రపతి క్షమాభిక్ష ఉంటుందనే విషయాన్ని తెలిపారు. అలాగే 2012, 2013, 2015లో ఒక్కొక్కరి ఉరిశిక్షను విధించామని పేర్కొన్నారు.
ఇందులో రాష్ట్రపతి వద్దకు 135 క్షమాభిక్ష పిటిషన్లు వచ్చాయని .. వాటిలో 34 తిరస్కరణకు గురయ్యానని సభకు వివరించారు. మరో 91 పిటిషన్లకు కూడా తర్వాత క్షమాభిక్ష లభించిందనే అంశాన్ని వెల్లడించారు. మరో పిటిషన్ మాత్రం పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. చిన్నపిల్లలపై లైంగికదాడులకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా ఇటీవల పోక్సో చట్టానికి సవరణ చేసినట్టు గుర్తుచేశారు. ఉగ్రవాదం, చిన్నారులపై దాడులపై తప్ప మిగతా విషయాల్లో ఉరిశిక్షను రద్దు చేయాలని 2015 ఆగస్టులో న్యాయ కమిషన్ సిఫార్సు చేసిందని గుర్తుచేశారు.