సీఎం సిద్దరామయ్య తల నరికేయాలి, ఫేస్ బుక్ లో యువకుల వార్నింగ్, బెంగళూరులో!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీఎస్ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి తల నరికేయాలని ఫేస్ బుక్ లో బెదిరింపులకు దిగారు.
కాంగ్రెస్ గూండాగిరి
బెంగళూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ నలపాడ్ విద్వత్ అనే యువకుడి మీద దాడి చేశాడని. మాల్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్వత్ మీద మళ్లీ దాడి చేసి హత్యాయత్నం చేశారని కేసు నమోదు కావడంతో మోహమ్మద్ జైలుకు వెళ్లాడు.
24 మంది హత్య !
సీఎం సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయిన తరువాత కర్ణాటకలో 24 మంది హిందూ సంఘ, సంస్థల కార్యకర్తలు హత్యకు గురైనారని బీజేపీ ఆరోపిస్తుంది. ఫిబ్రవరి 16వ తేదీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బెంగళూరులో ఏకంగా బీబీఎంపీ కార్యాలయంలో పెట్రోల్ చల్లి నిప్పంటించడానికి ప్రయత్నించాడని కేసు నమోదు అయ్యింది.
గూండారాజ్యం అంతం
కర్ణాటకలో గూండారాజ్యం అంతం చెయ్యాలంటే ముఖ్యమంత్రి సిద్దరామయ్య తల నరికేయాలని బెదిరిస్తూ అరు పూజార్, ముకుంద నాయక్ అనే యువకులు ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. సీఎం సిద్దరామయ్య మీద చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఎవరీ యువకులు ?
అరు పూజార్ అనే యువకుడు మంగళూరు యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేసి ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఇక ముకుంద నాయక్ అనే యువకుడు ఎవరు ? ఎక్కడున్నాడు ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
సీఎంకే వార్నింగా ?
ఒక రాష్ట్రానికి ముఖ్యంత్రి అయిన సిద్దరామయ్య గౌరవమైన స్థానంలో ఉన్నారని, అలాంటి ఆయన తల నరికేయాలి అంటూ ఫోస్ బుక్ లో హెచ్చరికలు జారీ చేసిన ఇద్దరు యువకులను చట్టపరంగా అరెస్టు చెయ్యడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.