బతుకు ఛిద్రం... 43కి చేరిన మృతుల సంఖ్య... అంతా అక్కడివాళ్లే....
కేరళలోని మున్నార్ సమీపంలో ఉన్న పెట్టిముడి ప్రాంతంలోని రాజమలైలో శుక్రవారం(అగస్టు 7) తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 43కి చేరింది. మట్టి పెళ్లల కింద ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తెలియదు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన రోజు 15 మంది మృతి చెందినట్లు చెప్పగా... క్రమంగా ఆ సంఖ్య 43కి చేరింది. మృతులంతా అక్కడి తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులే. వీరిలో ఎక్కువమంది తమిళనాడు నుంచి బతుకుదెరువు కోసం రాజమలై వచ్చినవారే.
Recommended Video
అంతా అక్కడివాళ్లే...
రాజమలై ప్రాంతంలో దాదాపు 80 మంది ప్రజలు నివసిస్తుండగా కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 43 మంది బలైపోయారు. మిగతావాళ్లలో ఇంకా ఎంతమంది శిథిలాల కింద చిక్కుకుపోయారో తెలియదు. వీళ్లంతా తమిళనాడులోని ట్యూటీకోరన్,తిరునల్వేలీ,టెన్కాశీ,విరుదునగర్,తిందివనం,థేని, కయతార్ ప్రాంతాలకు చెందినవారు. ఒకప్పుడు తీవ్ర కరువు కాటకాల కారణంగా తమవాళ్లు ఇక్కడి నుంచి కేరళ వెళ్లిపోయారని తమిళనాడులోని మృతుల బంధువులు గుర్తుచేసుకుంటున్నారు. అక్కడి టీ ఎస్టేట్స్లో నిలకడగా పని దొరుకుతుండటం,వసతి సౌకర్యం కూడా ఉండటంతో అక్కడే సెటిలైపోయినట్లు చెప్తున్నారు.
ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు...
కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో బతికి బయటపడ్డ జయరామన్ అనే వ్యక్తి మాట్లడుతూ... తన ఇంటికి 20మీ. దూరంలో ఉన్న ఇళ్లన్నీ కొండ చర్యలు పడి ధ్వంసమయ్యాయని చెప్పాడు. టీ ఎస్టేట్స్లో పనిచేసే మేఘనాథన్ అనే సూపర్వైజర్ మాట్లాడుతూ... తెల్లవారుజామున ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించిందన్నారు. ఏం జరిగిందే తెలిసేలోపే చాలా ఇళ్లు ధ్వంసమైపోయాయని చెప్పారు. మృతదేహాలు 15-20 అడుగుల బురదలో కూరుకుపోయానని తెలిపారు.
ఛిద్రమైన కుటుంబాలు...
ఈ ఘటనతో చాలా కుటుంబాలు ఛిద్రమైపోయాయి. ఒక కుటుంబంలో ఒక మహిళ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగా... ఆమె ముగ్గురు కుమార్తెలు,ఐదుగురు మనవలు,భర్త చనిపోయారు. మరో కుటుంబంలో షణ్ముగం,అతని భార్య బయటపడగా 22,19 ఏళ్ల వయసున్న అతని ఇద్దరు కొడుకులు మృతి చెందారు. ఇంకో కుటుంబానికి చెందిన గోపిక,ఆమె సోదరి మరో పట్టణంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఆన్లైన్ కోర్సులు నేర్చుకుంటుండటంతో... ఈ ప్రమాదం నుంచి వారు తప్పించుకున్నట్లయింది. కానీ వారి తల్లిదండ్రులు మాత్రం చనిపోయారు.
కడసారి చూపుకు అవకాశం లేదు...
తమిళనాడు నుంచి కేరళలోని రాజమలైకి వలస వెళ్లినవారిలో అత్యధికంగా తూత్తుకుడి జిల్లాలోని కయతార్ తాలుకాకు చెందినవారే. దాదాపు 55 మంది చాలా ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి అక్కడికి వెళ్లిపోయారు. అక్కడి తేయాకు తోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తమవాళ్ల మృతి గురించి తెలిసి కయతార్లోని బంధువులు తల్లడిల్లిపోతున్నారు. కనీసం కడసారి చూపు కోసం వెళ్దామన్న ఈపాస్ నిబంధనలు తమకు అడ్డంకిగా మారాయని వాపోతున్నారు. ఇదిలా ఉంటే,మృతుల కుటుంబాలకు కేరళ ప్రభుత్వం రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అయితే దాన్ని రూ.25లక్షలకు పెంచాలని డీఎంకె అధినేత స్టాలిన్ డిమాండ్ చేశారు.