ఆ బిల్లులు రైతులకు డెత్ వారెంట్: ఈస్టిండియా కంపెనీతో పోల్చుతూ రాజ్యసభలో కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ: రాజ్యసభ ముందుకు వచ్చిన వ్యవసాయ బిల్లుపై విపక్షాలు గందరగోళం సృష్టించాయి. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డాయి. వ్యవసాయ బిల్లులు అన్నదాతలకు డెత్వారెంట్ లాంటివని కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా ధ్వజమెత్తారు. ఇక టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు కూడా ఈ బిల్లులను వ్యతిరేకించారు.
Recommended Video
రాజ్యసభలో ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లులను వ్యతిరేకిస్తోందని చెప్పారు. రైతుల డెత్ వారెంట్లపై సంతకం చేయబోమని, రైతులకు కేంద్రం చేయాలనుకుంటున్న ప్రయోజనాలను కోరుకోవడం లేదన్నారు. అలాంటప్పుడు వారిని ఎందుకు బలవంతపెడతారు అని వ్యాఖ్యానించారు. ఒకసారి ఈ బిల్లు పాసైన తర్వాత వ్యవసాయమంతా కార్పొరేట్ల చేతిలోకి వెళ్లిపోతుందని ఆరోపించారు.
గతంలో ఈస్టిండియా కంపెనీ, పోర్చుగీసువారు భారత్పై ఎలా దాడి చేశారో.. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని బజ్వా ధ్వజమెత్తారు. కాగా, అంతకుముందు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ సంరద్బంగా మాట్లాడుతూ.. రైతుల జీవన ప్రమాణాలను మరింత పెంచేందుకు ఈ బిల్లులు దోహదం చేస్తాయని తెలిపారు.
ఇవి కనీస మద్దతు ధరకు సంబంధించిన బిల్లులు కావని, రైతులు తమ ఉత్పత్తులను స్వేచ్ఛగా బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు అవకాశం కల్పిస్తాయని కేంద్రమంత్రి తెలిపారు. కాంగ్రెస్ సహా విపక్షాలతోపాటు మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్, టీఆర్ఎస్ ఈ బిల్లులను వ్యతిరేకించాయి. ఇక మిగితా ఎన్డీఏ పక్షాలతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది.
ఈ క్రమంలో ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లులకు తాజాగా రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళనల మధ్యే సభలో బిల్లులు ఆమోదం పొందాయి. ఇక పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని రైతులు, రాజకీయ పార్టీలు భారీ ఆందోళనలు చేపట్టారు.రైతులకు మేలు చేసే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించడంపై ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్రమంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.