లోక్సభలో రికార్డు: మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు జరిగిన సమావేశాలు
న్యూఢిల్లీ: లోక్సభ సరికొత్త రికార్డుకు వేదికగా నిలిచింది. బుధవారం మధ్యాహ్నం 11 గంటల 58 నిమిషాలకు సభ్యులు చర్చ కోసం కూర్చుంటే రాత్రి 11 గంటల 58 నిమిషాల వరకు పలు అంశాలపై చర్చజరిగిందని పార్లమెంటరీ వ్యవహారాల శాక మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. గత 18 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఆయన గుర్తు చేశారు. ఇక రైల్వేశాఖకు కేటాయింపులపైనే ప్రధాన చర్చ జరిగింది.
ఇక రైల్వే శాఖకు కేటాయింపులపై ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం సమాధానం ఇస్తారు. అనంతరం ఓటింగ్ జరుగుతుంది. గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన చర్యలో దాదాపు 100 మంది సభ్యులు పాల్గొన్నారు. రైల్వే సేవలపై దృష్టి సారించాల్సిందిపోయి రైల్వే ఆస్తులను ప్రభుత్వం అమ్మాలని ప్రయత్నించడం దారుణమని విపక్షాలు ఆరోపించాయి. సామాన్యుడికి అందుబాటులో లేని బుల్లెట్ రైలు తీసుకురావడం వల్ల ఏం లాభం ఒనగూరుతుందని విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.
విపక్షాల ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. యూపీఏ హయాంలో ఉన్న రైల్వేశాఖ కన్నా తమ ప్రభుత్వంలో నడిచే రైల్వే శాఖ ఉన్నత స్థానంలో ఉండటమే కాకుండా కొత్త మైలురాళ్లను అధిగమిస్తోందని బీజేపీ ఎంపీ సునీల్ కుమార్ సింగ్ తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైల్వే ప్రమాదాలు 73శాతం వరకు తగ్గిపోయాయని సునీల్ కుమార్ సింగ్ సభకు తెలిపారు.