ఢిల్లీలో ఏపీ భవన్ విభజనపై చర్చ..! రేపు గవర్నర్తో తెలుగు సీఎంల భేటీ..!!
Recommended Video
అమరావతి/హైదరాబాద్ : విభజనతో అసంపూర్తిగా మిగిలిన పంపకాల పట్ల తెలుగు రాష్ఠ్రాల ముఖ్యమంత్రులు చురుకైన అడుగులు వేస్తున్నారు. సాద్యమైనంత తొందరగా పంపకాలను పూర్తి చేసుకుని పాలనపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత వారం ప్రగతి భవన్ లో భేటీ ఐన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు ఉమ్మడి రాష్టాల గవర్నర్ నరసింహన్ తో సమావేశం కాబోతున్నారు.
ఉమ్మడి రాజరాధానిగా ఇంకా ఐదేళ్ల సమయం ఉన్నందున ఈ లోపు అన్ని చిక్కుముడులను చాకచక్యంగా విప్పేందుకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు తో పాటు ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి సంసిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం చొరవ చూపని విభజన అంశాల పట్ట ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రావు ఈనెల 3న హైదరాబాద్లో గవర్నర్ నరసింహన్తో భేటీ కానున్నారు. విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్లో అంశాలు, ఆస్తులు, అప్పుల పంపిణీపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల ఇరువురు సీఎంలూ హైదరాబాద్ ప్రగతిభవన్లో సమావేశమై నదీజలాల సద్వినియోగం, గోదావరి జలాలను నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలకు మళ్లింపు వంటి అంశాలపై సమీక్షించారు.
9,10వ షెడ్యూల్ పరిధిలోని ఆస్తులు, అప్పులు, ఏపీభవన్ వాటాలపై ఇరు రాష్ట్రాల సీఎస్లు జోషి, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని అధికారుల బృందం సమీక్షించింది. అయితే పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోలేదు. విద్యుత్తు బకాయి 5000కోట్ల రూపాయల విషయంలో తెలంగాణ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది.
ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్నందున ఈ బకాయిలను తెలంగాణ చెల్లిస్తే పోలవరం హైడల్ ప్రాజెక్టు నిర్మాణం సునాయాసమవుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటా ఆస్తులు, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలపై సీఎంల భేటీలో గట్టి వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందంటున్నారు.