ఎయిర్ సెల్ దివాలా పిటిషన్! ట్రాయ్ ఆగ్రహం, కస్టమర్లకు ఊరటగా..
ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ సెల్ ముంబైలోని నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో బుధవారం దివాలా పిటిషన్ను దాఖలు చేసింది. ఆదాయం దారుణంగా పడిపోవడంతో ఆర్థిక ఒడుదొడుకులను తట్టుకోలేక దివాలా పిటిషన్ దాఖలు చేసింది.
ఆరు నగరాల్లో టెలికాం సేవలను నిలిపేస్తున్నట్లు ఎయిర్సెల్ ఇటీవల టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కి తెలిపింది. తాను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను కూడా వివరించింది. నెగెటివ్ బిజినెస్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్నట్లు కంపెనీ పేర్కొంది. భరించలేని రుణ భారానికి గురైనట్లు పేర్కొంది. నష్టాలు పెరిగినట్లు తెలిపింది.
ఒకప్పుడు లాభాలతో దూసుకెళ్లి...
ఎయిర్ సెల్.. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సంస్థ.. గత దశాబ్ద కాలం క్రితం తనకు ఎదురే లేకుండా వందల కోట్ల రూపాయల లాభాలతో దూసుకుపోయిన సంస్థ అది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎప్పుడైతే జియో టెలికాం రంగంలో ప్రవేశించిందో అప్పటినుండి ఎయిర్ సెల్తో పాటు మిగతా టెలికాం కంపెనీలకు కూడా కష్టాలు మొదలయ్యాయి. దీంతో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో దివాళా పిటిషన్ దాఖలు చేసింది. ఎయిర్ సెల్ కు 8 కోట్ల మంది వినియగదారులు ఉన్నారు. గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ (వెస్ట్) సర్కిళ్లలో గత నెల 31 నుంచే సేవలు ఆపేసింది.
రూ.120 కోట్ల లాభాల్లోంచి రూ.120 కోట్ల అప్పుల్లోకి...
రిలయన్స్ జియో ఆరంగేట్రానికి ముందు 2016లో ఎయిర్సెల్ ఆదాయం రూ.120 కోట్ల లాభంలో ఉండగా.. గతేడాది డిసెంబర్ నాటికి రూ.120 కోట్ల అప్పుల్లోకి కూరుకుపోయింది. అంటే జియో ప్రవేశంతో ఎయిర్సెల్కి ఎలాంటి ఎదురుదెబ్బ తగిలిందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీలో పనిచేస్తున్న 5 వేల మంది ఉద్యోగులను ఇప్పటికే అప్రమత్తం చేసింది. నిధుల కొరత కారణంగా ముందు ముందు మరిన్ని ‘కష్టాలను' ఎదుర్కునేందుకు సిద్ధపడాలంటూ ఇప్పటికే ఈమెయిల్స్ కూడా పంపినట్టు ఎయిర్సెల్ సీఈవో కైజాద్ హీర్జీ సదరు మెయిల్లో పేర్కొన్నట్టు చెబుతున్నారు.
రీస్ట్రక్చరింగ్పై ఏకాభిప్రాయం కుదరక...
ఎయిర్సెల్ మాతృసంస్థ కొంతమేర సొమ్ములు సర్దుబాటుచేసేందుకు ప్రయత్నించినప్పటికీ .. మళ్లీ వెనకడుగు వేసినట్టు సమాచారం. గతేడాది సెప్టెంబర్ నుంచి రుణదాతలతో ఎయిర్సెల్ చర్చలు జరుపుతున్నప్పటికీ.. రూ.15,500 కోట్ల భారీ మొత్తాన్ని సేకరించడంలో విఫలమైంది. రుణదాతలు, షేర్ హోల్డర్లతో సవివరంగా చర్చలు జరిపినప్పటికీ, రుణాలు, అప్పుల రీస్ట్రక్చరింగ్పై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో దివాళా పిటిషన్ దాఖలు చేసింది. ఎయిర్సెల్ దివాలతో మొత్తం నాలుగు ప్రయివేటు టెలికాం కంపెనీలు మార్కెట్ను వీడినట్టవుతుంది. మరోవైపు జియోను ఎదుర్కొనేందుకు వొడాఫోన్-ఐడియా కూడా త్వరలో విలీనమవనున్నాయి.
కస్టమర్లకు ఊరటగా పోర్టింగ్కు అవకాశం...
ఎయిర్ సెల్ తీరుపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగదారులు తమ ఖాతాల్లో వాడుకోకుండా మిగిలి ఉన్న బ్యాలన్స్ పై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఎయిర్ సెల్ సంస్థను ఆదేశించింది. అలాగే, ఎయిర్ సెల్ నెట్ వర్క్ నుంచి పోర్ట్ ద్వారా బయటకు వెళ్లేందుకు 90 రోజుల గడువు నుంచి కూడా వినియోగదారులకు మినహాయింపు కల్పించింది. అంటే కొత్తగా ఎవరైనా ఎయిర్ సెల్ నెట్ వర్క్లో చేరి లేదా పోర్ట్ ద్వారా ఎయిర్ సెల్కు మారి 90 రోజులు పూర్తి కాకపోయినప్పటికీ వారు ఎయిర్ సెల్ నుంచి బయటకు వెళ్లిపోవచ్చు. ఇతర రాష్ట్రాల్లోని కస్టమర్లకు సైతం ఎయిర్ సెల్ నెట్ వర్క్ పరిధిలో సమస్యలు ఎదురవుతుండడం కూడా ట్రాయ్ దృష్టికి వచ్చింది. దీంతో ట్రాయ్ ఈ మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది.