అడ్డదారులు తొక్కిన బీఎస్ఎప్ అధికారి: రూ. 125 కోట్ల మేర మోసం, 50 కోట్లు అప్పులు కట్టి..
గుర్గావ్: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) ఉన్నతాధికారి పనిచేసని ఓ వ్యక్తి కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డాడు. అంతేగాక, దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతని కారణంగా మోసపోయిన బాధితుల ఫిర్యాదుతో జైలుపాలయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మీ, పోలీసులు మీడియాకు వెల్లడించారు.
అప్పులు తీర్చేందుకు అడ్డదారులు వెతికిన అధికారి..
2012లో ఆర్మీలో చేరిన నిందితుడు ప్రవీణ్ యాదవ్.. బీఎస్ఎఫ్లో డిప్యూటీ కమాండెంట్ స్థాయికి ఎదిగాడు. డిప్యూటేషన్పై నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) కన్స్ట్రక్షన్ విభాగంలో గత ఏడాది వరకు విధులు నిర్వహించాడు. అయితే, తన ఆస్తినంతా స్టాక్ మార్కెట్లో పోగొట్టుకున్న ప్రవీణ్.. అప్పులు తీసుకుని మరీ ట్రేడింగ్ చేశాడు. దీంతో భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఈ అప్పులను తీర్చేందుకు అడ్డదారులు తొక్కాడు.
రూ. 125 కాజేసి.. విదేశాలకు చెక్కేద్దామనుకున్నాడు..
ఎన్ఎస్జీకి పలు నిర్మాణాలు చేపట్టాలని నకిలీ టెండర్లు ప్రకటించాడు. లావాదేవీలు జరపడం కోసం ఎన్ఎస్జీ పేరు మీదే మానేసర్లో నకిలీ బ్యాంక్ ఖాతా తెరిచాడు. టెండర్ల కోసం కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో నగదును అందులో జమ చేశారు. అలా వారి నుంచి ఏకంగా రూ. 125 కోట్ల వరకు వసూలు చేశాడు. ఈ మోసం బయటపడకముందే విదేశాలకు పారిపోయేందుకు కూడా సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే స్వచ్ఛంద పదవీ విరమణకు కూడా దరఖాస్తు చేసుకున్నాడు.
చివరకు కటకటాలపాలైన బీఎస్ఎఫ్ అధికారి, భార్య, సోదరి కూడా
ఈ క్రమంలో రెండు నెలలు గడిచినా నిర్మాణ పనులపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో కాంట్రాక్టర్లు.. ఎన్ఎస్జీని సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. మోసపోయినట్లు గుర్తించిన కాంట్రాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు. ఎన్ఎస్జీలోనే పనిచేసే తన సోదరి సాయంతో ఈ మోసానికి పాల్పడ్డాడని తేల్చారు. వచ్చిన డబ్బుతో తనకున్న రూ. 50 కోట్ల అప్పులను చెల్లించాడని పోలీసులు గుర్తించారు. కాగా, గురువారం ప్రవీణ్ యాదవ్ భార్య మమత, సోదరి రీతురాజ్లు పట్టుబడ్డారు. యాదవ్కు సహకరించిన ప్రాపర్టీ డీలర్ దినేష్ను కూడా పట్టుకున్నారు. వీరి నుంచి 10 లగ్జరీ వాహనాలతో పాటు రూ.13.8 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీబీపీలో ఉన్న రీతురాజ్ భర్త ప్రస్తుతం ఎన్ఎస్జీ క్యాంపస్లో డిప్యూటేషన్పై ఉన్నారు.