దారుణం: వడ్డీ కట్టలేదని దళితుడ్ని కొట్టి చంపారు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేనని అన్నందుకు ఓ దళిత వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేశారు ఇద్దరు దుర్మార్గులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేశ్ అనే దళితుడు కొద్ది రోజుల క్రితం మింటు అనే వడ్డీవ్యాపారి వద్ద రూ.40వేలు అప్పు తీసుకున్నాడు.
కాగా, ఇటీవలే ఆ డబ్బు అసలు తిరిగి ఇచ్చేశాడు. అయితే ఆ అప్పుకి వడ్డీ చెల్లించాల్సిందిగా వ్యాపారి నరేశ్ని డిమాండ్ చేశాడు. అయితే నరేశ్ వడ్డీని చెల్లించలేనని చెప్పాడు. దీంతో వ్యాపారి మింటు, ఆయన కుమారుడు మిను నరేశ్ని దారుణంగా కొట్టారు.
తీవ్రగాయాలపాలైన అతనిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాధితుడి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.