నిర్బయ కేసులో బాలనేరస్తుడికి ఊరట
న్యూఢిల్లీ: గత మూడు సంవత్సరాల క్రితం డిసెంబర్ 16వ తేదిన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో జువెనైల్ నేరస్తుడికి ఊరట లభించింది. అతను జైలు నుంచి విడుదల కావడానికి రంగం సిద్దం అయ్యింది.
నిర్బయ కేసులో అరెస్టు అయిన బాల నేరస్తుడిని ఈనెల 20వ తేదిన విడుదల చెయ్యాలని గతంలో కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నిర్బయ కుటుంబ సభ్యులు ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు.
శుక్రవారం వాదనలు పూర్తి అయ్యాయి. ఈ సందర్బంలో జువెనైల్ లో ఉన్న బాలనేరస్తుడి విడుదలపై తాము స్టే ఇవ్వలేమని ఢిల్లీ హై కోర్టు స్పష్టం చేసింది. హై కోర్టు తీర్పుతో బాల నేరస్తుడు ఈ నెల 20న విడుదల అయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణలు అంటున్నారు.
నిర్బయ కేసులో తమకు న్యాయం జరగలేదని ఆమె తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కీచకుడిని విడుదల చేస్తే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్లడానికి అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.