మంగళూరులో ముందస్తు కుట్ర జరిగిందా..? సీసీ ఫుటేజీలో ఏముంది..?
మంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై మంగళూరులో చోటుచేసుకున్న ఆందోళనలు ముందస్తుగానే ప్లాన్ చేశారా..? అల్లర్లు సృష్టించేందకు కుట్ర చేశారా.. అని అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి అక్కడి సీసీ కెమెరాలు. ఈ సీసీ కెమెరాల్లోని వీడియోలు ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ ఇండియాటుడే చేతికి చిక్కాయి.
కళ్ల ముందే నా తండ్రిని కాల్చి చంపారు... మంగళూరు కాల్పుల్లో చనిపోయిన బాధితుడి కూతురు
డిసెంబర్ 19న ఏం జరిగింది..?
పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా మంగళూరులో ఆందోళనలు జరిగాయి. అయితే డిసెంబర్ 19న మంగళూరులో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మగళూరు నార్త్ పోలీస్ స్టేషన్కు తాళం వేసి పోలీసులపై దాడి చేసేందుకు ఆందోళనకారులు యత్నించారు.ఇందులో భాగంగానే పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. అయితే పోలీసుల చర్యను తీవ్రంగా తప్పుబట్టాయి మృతుల కుటుంబ సభ్యులు, రాజకీయ పార్టీలు. అయితే డిసెంబర్ 19న అసలు జరిగిందేంటి..? సెక్షన్ 144 ఉండగా ఆ రోజు ఏం జరిగింది..? ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్కు ఇండియా టుడే అక్కడి సీసీ ఫుటేజీలను సేకరించింది.
బయటపడ్డ సీసీ ఫుటేజీలు
ఇండియా టుడే సేకరించిన ఫుటేజీలను జాగ్రత్తగా పరిశీలిస్తే మంగళూరులో ఆ రోజు ఏమి జరిగిందనేది స్పష్టంగా తెలుస్తోంది. బందర్ పోలీస్ స్టేషన్లోకి ఆందోళనకారులు ఎలా దూసుకొచ్చారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. వీటిని పరిశీలిస్తే ముందస్తు వ్యూహాన్ని ఆందోళనకారులు అమలు చేసినట్లు తెలుస్తోంది. బందర్ పోలీస్ స్టేషన్కు ఉన్న అన్ని మార్గాలను ఆందోళనకారులు మూసివేసిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీల్లో కనిపించాయి. కొందరు గోన సంచుల నుంచి రాళ్లు బయటకు తీయడం వీడియోలో స్పష్టంగా కనిపించాయి. ఆ తర్వాత రాళ్లను తీసి పోలీసులపైకి రువ్వడం కనిపించాయి.
సీసీ కెమెరాలను ధ్వంసం చేసే ప్రయత్నం
మధ్యాహ్నం 2 గంటల తర్వాత పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. పోలీసు స్టేషన్ దగ్గర కొందరు ముసుగు ధరించి పోలీసులపైకి రాళ్లు రువ్వడం కనిపించింది. పోలీసులు వస్తున్న బస్సుపై కూడా రాళ్లు రువ్వడంతో బస్సు పక్కకు వెళ్లిపోయింది.ఇక కొన్ని చోట్ల సీసీ కెమెరాలను కూడా దిశను మార్చారు ఆందోళనకారులు. మధ్యాహ్నం 4:30 గంటల నుంచి 4:45 గంటల మధ్య పోలీస్ స్టేషన్పై రాళ్ల దాడి పెరిగింది. ఆ తర్వాత ముసుగు ధరించిన ఒక వ్యక్తి రోడ్డుపై పాత టైర్లు , ఇతర వస్తువులు తీసుకొచ్చి నిప్పు పెట్టడం కనిపించింది.
ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం
ఇక పోలీస్ స్టేషన్ వెనకాలే ఓ లైసెన్స్ కలిగి ఉన్న తుపాకీ దుకాణం ఉంది. ఆందోళనకారులు అందులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక పోలీస్ స్టేషన్ దగ్గరకు ఆందోళనకారులు వస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో భాష్పవాయువు , రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాల్సి వచ్చింది. స్టేషన్లో కొన్ని రైఫిళ్లు, తుపాకీలు, రెండు వేల బుల్లెట్లు ఉన్నాయి. భాష్ప వాయువు ప్రయోగం చేసినప్పటికీ ఆందోళనకారులు వెనక్కు తగ్గడంతో రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. అప్పటికీ భయపడకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక్కడే జలీల్ కుద్రోలీ, నౌషీన్లు మృతి చెందారు.
ఆయుధాలు ఎత్తుకుపోయేందుకు కుట్ర
ఇదిలా ఉంటే పోలీస్ స్టేషన్పై దాడిచేసేందుకు ఆందోళనకారులు వచ్చారని పోలీసులు చెబుతున్నారు. స్టేషన్పై దాడి చేసి ఆయుధాలను లూటీ చేద్దామని ఆందోళనకారులు ప్రయత్నించగా వారిని అదుపు చేసేందుకు మాత్రమే గాల్లోకి కాల్పులు జరిపామని పోలీసులు చెప్పారు. మంగళూరు పోలీసు శాఖలో 1000 మంది పోలీసులు ఉన్నారని, మరింత బలగాలను తరలించేందుకు గంట నుంచి రెండు గంటల సమయం పడుతుందని చెప్పారు. అయితే కాల్పలు కాకుండా పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఉండొచ్చని మృతుల కుటుంబాలు చెబుతున్నాయి.