అమ్మ ‘జయలలిత’ఒక్క రోజు ముందే చనిపోయారా ?
అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించిన వివరాల ప్రకారం డిసెంబర్ 5వ తేదిన జయలలిత గుండెపోటుతో మరణించారని సమాచారం.అయితే డిసెంబర్ 4వ తేది ఆదివారం జయలలిత మరణించారని వార్తలు గుప్పుమన్నాయి.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై రోజుకోక కొత్త విషయం బయటకు వస్తోంది. అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించిన వివరాల ప్రకారం డిసెంబర్ 5వ తేదిన జయలలిత గుండెపోటుతో మరణించారని సమాచారం.
అయితే డిసెంబర్ 4వ తేది ఆదివారం జయలలిత మరణించారని వార్తలు గుప్పుమన్నాయి. అన్నాడీఎంకే నాయకులు ఆదివారం సాయంత్రం నుంచి జయలలిత అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలు పెట్టారని తాజాగా వెలుగు చూసింది.
జయలలిత పార్థీవదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ ను శుభ్రం చెయ్యాలని అక్కడి సిబ్బందికి ఆదివారం ఆదేశాలు అందాయట. ఈ విషయం బయటకు రావడంతో అన్నాడీఎంకే పార్టీలోని కీలకనేతలకు ఆదివారం జయలలిత మరణించారనే విషయం తెలిసిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అపోలో ఆసుపత్రి యాజమాన్యం సైతం అన్నాడీఎంకే పార్టీ కీలక నేతల సూచనల మేరకు సోమవారం అర్దరాత్రి జయలలిత మరణించారని ప్రకటించారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే జయలలిత ఆదివారం చనిపోయి ఉంటే సోమవారం అర్దరాత్రి వరకు ఎందుకు గోప్యంగా ఉంచారు ? ఆ ఒక్క రోజు ఏమీ జరిగింది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆదివారం సాయంత్రం గవర్నర్ విద్యాసాగర్ రావు హడావిడిగా చెన్నై చేరుకున్నారు. అదే రోజు రాత్రి అపోలో ఆసుపత్రి చేరుకుని జయలలితను చూశారు. అయితే సోమవారం వరకు ఆయన రాజ్ భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదనే విషయం అందరికి తెలిసిందే.