కర్నాటర రెబెల్ ఎమ్మెల్యేలపై నిర్ణయం బుధవారంలోగా తీసుకుంటాం: సుప్రీం కోర్టుతో స్పీకర్
Recommended Video
బెంగళూరు: కర్నాటకలో రాజకీయ సంక్షోభం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. తమపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారణ చేపట్టిన స్పీకర్ ఎందుకు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడం లేదో చెప్పాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కోరారు. దీంతో రెబెల్ ఎమ్మెల్యేలపై రేపటిలోగా నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర స్పీకర్ కేఆర్ రమేష్ తెలిపారు. వాదనల సందర్భంగా కాంగ్రెస్ తరపున సీనియర్ అడ్వకేట్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. వాదనల సందర్భంగా సింఘ్వీ దీనిపై స్టేటస్ కో ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
మరోవైపు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అనర్హత వేటు పేరుతో బలవంతంగా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ న్యాయస్థానికి ఫిర్యాదు చేశారు. మంగళ వారం రోజున పదిమంది రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో స్పీకర్ పై ఫిర్యాదు చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా బలవంతం చేస్తున్నారని చెప్పారు. అంతేకాదు వారి రాజీనామాలను ఆమోదించడంలో జాప్యం వహిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
ప్రస్తుతం కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో ఉంది. అయితే స్పీకర్కు రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించడం తప్ప మరో దారి కనిపించడం లేదు. రెబెల్ ఎమ్మెల్యేల తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్లో ఉన్నాయా లేదా... వారి రాజీనామాలు ఒకరి ప్రోద్భలంతో చేశారా లేదా అన్న అంశాలు మాత్రమే స్పీకర్ పరిగణించాల్సి ఉంటుందని న్యాయస్థానికి తెలిపారు ముకుల్ రోహత్గీ.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల రాజీనామాలు సరైన ఫార్మాట్లో లేకుంటే స్పీకర్ రాజీనామాలపై ఎలా నిర్ణయం తీసుకుంటారని సీఎం కుమారస్వామి అన్నారు. అలాంటప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టు చెప్పడం భావ్యం కాదని కుమారస్వామి అన్నారు.