అర్ధరాత్రి అంత్యక్రియలు... ఆ నిర్ణయం వాళ్లదే.. నేనేమీ మాట్లాడలేను : యూపీ డీజీపీ
హత్రాస్ గ్యాంగ్ రేప్ మృతురాలికి రాత్రికి రాత్రే అంత్యక్రియలు నిర్వహించాలన్న నిర్ణయం స్థానిక అధికారులు తీసుకున్నదేనని ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్సీ అవస్తీ పేర్కొన్నారు. దానిపై తానేమీ మాట్లాడలేనని చెప్పారు. శనివారం(అక్టోబర్ 3) హత్రాస్లోని బూల్గర్హీలో బాధిత కుటుంబంతో భేటీ అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు.
హత్రాస్ ఎఫెక్ట్ : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి వారణాసిలో షాక్... చుట్టుముట్టిన నిరసనకారులు...
'పరిస్థితి ఇంతదాకా ఎందుకొచ్చింది.. వాళ్ల సమస్యకు,ఆవేదనకు తగ్గ పరిష్కారం ఎందుకు దొరకలేదు... ఈ వివరాలు మేము తెలుసుకోవాలనుకున్నాం..' అని డీజీపీ అవస్తీ తెలిపారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలన్న బాధిత కుటుంబం డిమాండుపై డీజీపీని మీడియా ప్రశ్నించగా... ఉత్తరప్రదేశ్ పోలీసులపై నమ్మకం ఉంచండని వారికి చెప్పామన్నారు. బాధిత కుటుంబం చేస్తున్న అన్ని ఆరోపణలపై సిట్ విచారణ జరుపుతుందన్నారు.
హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలిసేందుకు ప్రజాప్రతినిధులను కూడా అనుమతిస్తున్నామని... అయితే ఒకసారి ఐదుమందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవనీష్ అవస్తీతో కలిసి డీజీపీ హెచ్సీ అవస్తీ బాధిత కుటుంబంతో భేటీ అయ్యారు. హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత బాధితురాలి కుటుంబాన్ని ఉన్నతాధికారులు కలుసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
మరోవైపు బాధిత కుటుంబాన్ని కలుసుకునేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అనుమతినివ్వడంతో ఆయన హత్రాస్ బయలుదేరారు. బాధిత కుటుంబం ఫోన్లు లాగేసుకున్నారని... వారిపై పోలీసులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రాహుల్ హత్రాస్ వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాధిత కుటుంబంతో భేటీ అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
I can't comment on this. The decision was taken at the local (administration) level: DGP HC Awasthy on allegations that permission was not sought from the family members of the victim of #HathrasCase before performing her last rites pic.twitter.com/qlGR5wwgPP
— ANI UP (@ANINewsUP) October 3, 2020
Recommended Video
సెప్టెంబర్ 14న పశువులకు గడ్డి కోసుకొచ్చేందుకు పొలానికి వెళ్లిన దళిత(వాల్మీకి) యువతిపై నలుగురు అగ్ర కులాలకు చెందిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా మొదట పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. బాధితురాలికి సరైన వైద్య సహాయం కూడా అందకపోవడంతో రెండు వారాల తర్వాత సెప్టెంబర్ 29న ఢిల్లీలోని సఫ్దర్గంజ్ ఆస్పత్రిలో మృతి చెందింది. అయితే అదే రోజు రాత్రికి రాత్రి పోలీసులు కుటుంబ సభ్యులను సైతం అనుమతించకుండా యువతి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. మృతురాలి,బాధిత కుటుంబం ప్రాథమిక హక్కులను సైతం హరించేలా అక్కడి పోలీసులు,అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.