భారత్-రష్యా సదస్సు వాయిదా... అసలు కారణమిదే.. ఆ ప్రచారంలో నిజం లేదు..
ఈ ఏడాది చివరలో జరగాల్సిన భారత్-రష్యా వార్షిక సదస్సును కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసినట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. రెండు దేశాలు పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. భారత్-రష్యా సదస్సు వాయిదా పడటం పట్ల దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. భారత్లో రష్యా రాయబారి నికోలే కుదషేవ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
ఇండో పసిఫిక్ రీజియన్లో అమెరికా,భారత్,ఆస్ట్రేలియా,జపాన్ కలిసి 'క్వాడ్'గా ఏర్పడటం పట్ల రష్యా గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అమెరికా యాంటీ చైనా గేమ్లో భాగంగా భారత్ను వాడుకుంటోందని విమర్శించింది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్-రష్యా సదస్సు రద్దవడానికి క్వాడ్కి ముడిపెడుతూ జాతీయ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. భారత్ క్వాడ్లో భాగస్వామిగా ఉండటం ఇష్టం లేనందువల్లే రష్యా ఇక్కడి సదస్సును రద్దు చేసుకుందని ఆ కథనాలు పేర్కొన్నాయి. తాజాగా నికోలే కుదషేవ్ ఆ కథనాలను ఖండించారు. అవి వాస్తవానికి పూర్తి విరుద్దంగా ఉన్నాయన్నారు. కరోనా వైరస్ కారణంగానే భారత్ రష్యా సదస్సు వాయిదా పడిందన్నారు. సదస్సు ఎప్పుడు నిర్ణయించాలనే విషయంపై భారత అధికారులతో టచ్లో ఉన్నామన్నారు.
మరుసటి ఏడాది మొదటి ఆర్నెళ్లలో భారత్-రష్యా సదస్సు జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రానున్నారు. నిజానికి ఈ ఏడాది అక్టోబర్లోనే రష్యాతో భారత్ సమ్మిట్ జరగాల్సి వున్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం కోసం ద్వైపాక్షిక కమిషన్ వచ్చే ఏడాదిలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు ఇటీవల నికోలయ్ కుదషేవ్ తెలిపారు.
భారత్-రష్యా సదస్సు వాయిదా పడటంపై అంతకుముందు రాహుల్ గాంధీ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. రష్యా భారత్కు కీలక మిత్ర దేశమని... అలాంటి దేశంతో సంబంధాలు దెబ్బతినడం మంచి సంకేతం కాదని అన్నారు. తాజాగా విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు భారత్లో రష్యా రాయబారి దీనిపై స్పందించడంతో ఈ విమర్శలకు తెరపడిందనే చెప్పాలి.