కరోనాతో చనిపోయాడన్నారు-బాడీ ఇస్తే అంత్యక్రియలు చేసేశారు-చివరికి కోలుకుని ఇంటికి....
ప్రస్తుతం కరోనా కాలం. కుటుంబ సభ్యులకు కరోనా సోకినా దగ్గరుండి చికిత్స చేయించని పరిస్దితి. చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించలేని దుస్ధితి దాపురించింది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో ఓ 75 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకింది. చికిత్స కొనసాగుతుండగానే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని కూడా తీసుకెళ్లారు. అశ్రునయనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత సదరు వృద్ధుడు బతికే ఉన్నాడని ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.
నవంబర్ 4న పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దాలో ఉన్న బల్రామ్పూర్ బసు ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో శిబ్దాస్ బెనర్జీ అనే 75 ఏళ్ల వృద్ధుడు చేరాడు. నవంబర్ 13వ తేదీన అతను చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు డాక్టర్లు సమాచారమిచ్చారు. ఆస్పత్రికి వచ్చిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం వారికి ఆస్పత్రిలోని డాక్టర్ల నుంచి ఓ ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసిన కుటుంబ సభ్యులకు షాకింగ్ సమాచారం అందింది. మీరు ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేర్పించిన వ్యక్తి బతికే ఉన్నాడనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతోకుటుంబ సభ్యులకు చిర్రెత్తుకొచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంబయటికొచ్చింది.
ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దాలో జరిగిన ఈ ఘటనపై బెంగాల్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నలుగురు సభ్యులతో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. శివ్దాస్ బెనర్జీ ఆస్పత్రిలో చేరిన రోజే అదే వయసున్న మోహనీమోహన్ ముఖర్జీ అనే మరో వృద్ధుడు కూడా అదే ఆస్పత్రిలో చేరారు. తర్వాత ఆయన పరిస్ధితి విషమించడంతో మరో ఆస్పత్రికి తరలించారు. చివరికి అతను చనిపోయాడు. కానీ ఇద్దరి వయసు, ఇతర వివరాలు దాదాపు ఒకేలా ఉండటంతో ముఖర్జీకి బదులుగా బెనర్జీ చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించడం, ముఖర్జీ మృతదేహం బెనర్జీ కుటుంబానికి ఇవ్వడం, వారు అంత్యక్రియలు నిర్వహించడం కూడా జరిగిపోయాయి. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బెనర్జీ కోలుకోవడంతో వచ్చి తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాల నుంచి వచ్చిన ఫోన్తో ఈ అరాచకం బయటికొచ్చింది. ప్రభుత్వం దీనిపై విచారణ నిర్వహించి ఆస్పత్రిపై కేసుల నమోదుకు సిద్ధమవుతోంది.