year ender 2020: పాక్ ఉగ్ర తోక కట్, గత 44 ఏళ్లలో తొలిసారి, ఉగ్రవాదం తగ్గిందిలా
జమ్మూ: ప్రపంచమంతా చైనా పంపిన కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. మన సైన్యం మాత్రం చైనా మహమ్మారితోపాటు పాకిస్థాన్ పంపుతున్న ఉగ్రవాదంతోనూ అవిశ్రాంతంగా పోరాడుతోంది. 2020 సంవత్సరంలో సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడిన ఏ ఒక్క ఉగ్రవాదినీ విడిచిపెట్టకుండా పరలోకాలకు పంపాయి భారత భద్రతా దళాలు. తమ ప్రాణాలు పోతున్నా.. వెనుకడుగు వేయకుండా తమ దేశ సోదరుల కోసం పోరాడారు సైనికులు.
నెలకు 20 చొప్పున ఉగ్రవాదులను పైకి పంపేశారు..
భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా జమ్మూకాశ్మీర్లో ఉగ్రవేటను కొనసాగించారు. ఉగ్ర కాల్పుల్లో భద్రతా దళాలతోపాటు పలువురు పౌరులు కూడా ప్రాణాలు విడిచారు. 100కు పైగా కౌంటర్ టెర్రరిజమ్ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించి 225 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వార్షిక ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడించారు.
కాశ్మీర్లో 207 మంది ఉగ్రవాదులను, జమ్మూ డివిజన్లో 18 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. భద్రతా దళాల చేతిలో హతమైన ఉగ్రవాదుల్లో 47 మంది టాప్ కమాండర్లు కూడా ఉన్నారని ఆయన వివరించారు. ఇప్పటి వరకు అన్ని ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన టాప్ కమాండర్లను ఏరివేశామని వివరించారు.
దేశం కోసం ప్రాణాలొదిలిన పోలీసులు, జవాన్లు..
ఈ ఏడాదిలో ఉగ్రవాదులతో పోరాడుతున్న సమయంలో 16 మంది జమ్మూకాశ్మీర్ పోలీసులు, 44 మంది జవాన్లు ప్రాణాలు వదిలినట్లు డీజీపీ తెలిపారు. ఉగ్రవాదులకు సహాయకులు(మెసేంజెర్స్, కొరియర్స్)గా ఉంటున్న వారిని కూడా అదుపులోకి తీసుకుని శిక్షించామని తెలిపారు. ఉగ్రవాదుల కోసం పనిచేస్తున్న 635 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
వీరిలో 56 మందిపై పబ్లిక్ సేఫ్టీ యాక్ట్(పీఎస్ఏ) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 2020లో 299 మంది ఉగ్రవాదులను, వారి సహాయకులను అరెస్ట్ చేశారు. మరో 12 మంది ఉగ్రవాదులు పోలీసులు ముందు లొంగిపోయారని చెప్పారు. యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో పెద్ద ఎత్తున ఉగ్రవాదుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 426 ఆయుధాలు, 9000 బుల్లెట్లు, మెగజిన్స్, భారీ ఎత్తున పేలుడు పదార్థాలను సీజ్ చేసినట్లు వివరించారు.
గత 44 ఏళ్లలో తొలిసారి..
పోలీసులు, జవాన్ల సంయుక్త ఆపరేషన్ల కారణంగా ఈ ఏడాది ఉగ్రవాద దాడుల్లో మరణించిన పౌరుల సంఖ్య అతితక్కువగా ఉందని డీజీపీ తెలిపారు. 38 మంది పౌరులు ఉగ్రదాడుల్లో మరణించారని తెలిపారు. కాగా, గత 44 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువ కావడం గమనార్హం.
ఉగ్ర రిక్రూట్మెంట్లు పెరిగినా.. కట్ చేశారు..
గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఉగ్రవాదుల రిక్రూట్మెంట్లు పెరిగాయని చెప్పారు. అయితే, వీరిలో 70 శాతం మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని తెలిపారు. మరికొంతమంది ఉగ్రవాదాన్ని వదిలేసి సాధారణ జీవితాన్ని గడిపేందుకు మొగ్గుచూపారని తెలిపారు. కొత్తగా రిక్రూట్ చేసుకున్న 76 మందిలో 46 మంది అరెస్ట్ కాగా, మిగితావారు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారని డీజీపీ తెలిపారు. పోలీసులు, జవాన్ల సంయుక్త ఆపరేషన్లతో జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదం బాగా తగ్గిపోయిందని తెలిపారు.
పాక్ తోక వంకరే.. కానీ, ఊరుకుంటామా?
కుక్కతో వంకరే అన్నట్లుగా పాకిస్థాన్ జమ్మూకాశ్మీర్లోకి ఉగ్రవాదుల్ని పంపే ప్రక్రియను ఆపడం లేదు. ఇక్కడ శాంతి పరిస్థితులను దెబ్బతీయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉందని డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. జమ్మూ ప్రాంతంలో డజన్ల కొద్దీ ఉగ్రవాద గ్రూపులు పనిచేసేవని.. ఇప్పుడు అవి మూడింటికి తగ్గించబడ్డాయని చెప్పారు. వారంతా కిష్ట్త్వార్ జిల్లాలోనే ఉన్నారని.. వారిని కూడా లేకుండా చేస్తామని స్పష్టం చేశారు.
మంచి పరిణామం: ఉగ్రవాదానికి ముఖం చాటేస్తున్న యువత
గత మూడు సంవత్సరాలతో పోలిస్తే పాకిస్థాన్ నుంచి వచ్చి దాడులు చేసే ఉగ్రవాదుల సంఖ్య బాగా తగ్గిందని తెలిపారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఇక్కడి స్థానికులనే ఉగ్రవాదులుగా తయారు చేసి వాడుకుంటోందని తెలిపారు. వారికి ఆయుధాలు, పేలుడు పదార్థాలను, డబ్బును డ్రోన్ల ద్వారా పంపిస్తోంది. అయితే, పాక్ చర్యలను భారత భద్రతా దళాలు సఫలం కానివ్వడం లేదని డీజీపీ వివరించారు. పోలీసులు, జవాన్ల సంయుక్త ఆపరేషన్లతో ఉగ్రవాదాన్ని దాదాపు సమూలంగా తగ్గించేశారు. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సిన మంచి విషయం ఒకటేమిటంటే.. స్థానిక యువకులు ఉగ్రవాద గ్రూపుల్లో చేరేందుకు ఆసక్తి చూపడం చాలా వరకు తగ్గిపోయింది అని తెలిపారు.