'సెప్టిక్ షాక్'లో ప్రణబ్ ముఖర్జీ... మరింత క్షీణించిన ఆరోగ్యం...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్(84) ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తర్వాత ఆయన 'సెప్టిక్ షాక్' స్థితిలోకి వెళ్లిపోయారని ఢిల్లీలో ఆయన చికిత్స పొందుతున్న ఆర్మీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికీ ఆయన డీప్ కోమాలోనే ఉన్నారని... వెంటిలేటర్ సపోర్ట్తో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
సాధారణంగా సెప్టిక్ షాక్కి గురయ్యే వ్యక్తుల్లో గుండె,మెదడు,కిడ్నీలు వంటి కీలక అవయవాలు దెబ్బతినడం,బీపీ తీవ్రంగా పడిపోవడం జరుగుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు మూత్ర సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. ఒకరకంగా సెప్టిక్ షాక్లోకి వెళ్లడమంటే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లే.ఇన్ఫెక్షన్ బారినపడిన తర్వాత శరీరంలో బీపీ ఒక్కసారిగా పడిపోవడంతో ఈ ప్రమాదకర పరిస్థితి తలెత్తుతుంది.
Recommended Video
మెదడులో రక్తం గడ్డ కట్టడంతో అగస్టు 10న ప్రణబ్ ముఖర్జీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కరోనా బారిన కూడా పడ్డారు. ఆ తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్,కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. డీప్ కోమాలో ఉన్న ప్రణబ్ సెప్టిక్ షాక్లోకి వెళ్లారని తెలియడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావాలని ఎంతోమంది కోరుకుంటున్నారు.