చంద్రయాన్2 విఫలం కాలేదు!: విక్రమ్ ల్యాండర్ ఏం చేస్తోంది? 95శాతం విజయవంతమేనా?
బెంగళూరు: చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే ముందు 15 నిమిషాలే అత్యంత భయంకరమైనవని ఇస్రో ఛైర్మన్ కే శివన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, అంతా చక్కగా సాగుతుందనుకున్న తరుణంలో విక్రమ్ ల్యాండ్ నుంచి సంకేతాలు తెగిపోవడం శాస్త్రవేత్తలకు నిద్రలేని రాత్రులని మిగిల్చింది.
చంద్రయాన్ 2 విజయవంతం కావాలని దేశ ప్రధాని నుంచి దేశంలోని ప్రతీ పౌరుడు కూడా కోరుకున్నాడు. ప్రధాని మోడీ నేరుగా ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి చంద్రయాన్ 2 ల్యాండింగ్ను చూసేందుకు బెంగళూరుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఆ ఉద్విగ్న క్షణాలు చివరకు ఇస్రో ఛైర్మన్ సహా శాస్త్రవేత్తలకు కన్నీళ్లనే మిగిల్చాయి.
ఆశలున్నాయి, 14రోజులపాటు ప్రయత్నాలు: చంద్రయాన్ 2పై ఇస్రో ఛైర్మన్, మోడీ తీరుపై ఇలా..
మొదట ఆనందం..
చంద్రుడికి 35 కిలోమీటర్ల ఎత్తు నుంచి విక్రమ్ ల్యాండర్ను కిందకు దించే క్రంలో తొలి దశ అయిన ‘రఫ్ బ్రేకింగ్'విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ ఆనందం నెలకొంది. ఇక ‘ఫైన్ బ్రేకింగ్.. ఫైన్ ల్యాండింగ్' దశ ఆరంభం కావడంతో శాస్త్రవేత్తలతోపాటు అక్కడేవున్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆనందంలో మునిగిపోయారు.
అంతా క్షణాల్లోనే..
అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటుండగానే.. మరి కొద్ది క్షణాల్లో ల్యాండర్ నుంచి సంకేతాలు లేకుండా పోయాయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇస్రో ఛైర్మన్ కే శివన్ ఇతర శాస్త్రవేత్తలతో ఏం జరిగిందనే విషయంపై చర్చించారు. ఆ తర్వాత గ్యాలరీలో కూర్చున్న ప్రధాని మోడీ వద్దకు శివన్ వెళ్లి పరిస్థితిని తెలియజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగంతో ఉన్న శాస్త్రవేత్తలకు మోడీ ధైర్యం చెప్పారు. జయాపజయాలు సాధారణమేనని, మనం గొప్పం ప్రయత్నం చేశామని.. మరోసారి విజయం సాధించేందుకు సిద్ధం కావాలని శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపారు.
ఏం జరిగింది??
సంకేతాలు తెగిపోయిన తర్వాత విక్రమ్ ల్యాండర్ ఏమైపోయిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలోనే తిరుగుతున్న ల్యాండర్కు ఆర్బిటర్కు మధ్య ఓ విధంగా కమ్యూనికేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందని కొందరు నిపుణలు పేర్కొంటున్నారు. ల్యాండర్ చంద్రుడిపై దిగడంలో వేగాన్ని తగ్గించుకోకుండా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొనడంతోనే సంకేతాలు ఏమైనా తెగిపోయాయేమోనని అని భావిస్తున్నారు.
సంకేతాలు వచ్చే అవకాశం?
అలా జరిగితే మరోసారి ఇస్రో కేంద్రం నుంచి ప్రయత్నాలు జరిపితే ఏమైనా ఫలితం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ల్యాండింగ్ ప్రదేశంలో వాతావరణ పరిస్థితులు మారితే, ఏదైనా అనుకోని పరిణామం జరిగితే మళ్లీ ల్యాండర్ నుంచి సంకేతాలు వచ్చే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. అంతేగాక, ఆర్బిటర్ నుంచి వచ్చే సమాచారంతో ల్యాండర్ పరిస్థితిని సమీక్షించవచ్చని అంచనా వేస్తున్నారు.
మరో 14రోజులపాటు ప్రయత్నాలు..
చంద్రయాన్ 2పై ఆశలు ఇంకా ఉన్నాయని.. మరో 14 రోజుల వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ఇస్రో ఛైర్మన్ శివన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కమ్యూనికేషన్ డేటాను ఇస్రో విశ్లేషిస్తోంది. విక్రమ్ సాఫీగా దిగితే దాని నుంచి సంకేతాలు రాబట్టే ప్రయత్నాలన్నింటినీ చేస్తోంది. ల్యాండర్ రికార్డు చేసిన డేటాను పూర్తిగా రాబట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. భూమికి చంద్రుడికి మధ్య ఉన్న 3,84,000 కిలోమీటర్ల దూరంలో 3,83,998 కిలోమీటర్ల ప్రయాణాన్ని అది విజయవంతంగా పూర్తి చేసింది. అంటే దాదాపు 0.0006శాతం తేడాతో చంద్రయాన్ 2 విజయవంతం నుంచి దూరమైందన్నమాట.
95శాతం విజయవంతమేనా?
చంద్రయాన్ స్పేస్క్రాఫ్ట్లో మొత్తం 13 పరిశోధన పరికరాలు ఉన్నాయని.. వాటిలో 8 ఆర్బిటర్లోనే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ల్యాండర్లో మూడు, రోవర్లో రెండు ఉన్నాయి. ఆర్బిటర్ చంద్రుడి ఉపరితలానికి దాదాపు 100 కి.మీ ఎత్తులో పరిభ్రమిస్తోంది. ఇక్కడి నుంచి రిమోట్ సెన్సింగ్ పరిశీలనలు, ఫొటోలు తీయడం, చంద్రుడి బాహ్య వాతావరణాన్ని పరిశీలించడం, ఖనిజాలు, నీటి జాడను తెలియజేస్తుంది. అందువల్ల ఈ చంద్రయాన్-2 95శాతం విజయవంతమైందనే చెప్పవచ్చని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.