బ్యాగులో 9 ఏళ్ళ బాలిక మృతదేహం, ఎవరామె?
న్యూఢిల్లీ: హర్యానాలోని రోహ్తక్లో తొమ్మిదేళ్ళ బాలిక మృతదేహం ఓ బ్యాగులో లభ్యమైంది. బాలికను హతమార్చిన గుర్తు తెలియని దుండగులు ఎవరికీ అనుమానం రాకుండా బ్యాగులో కుక్కి ఓ కాలువలో పడేశారు. మృతి చెందిన బాలిక ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
హర్యానాలోని రోహ్తక్లో తొమ్మిదేళ్ళ బాలిక మృతదేహం బ్యాగులో పెట్టి కాలువలో పడేయడం కలకలం రేపుతోంది. రోహ్తక్లోని సర్ధార్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఆదివారం నాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
టిటోలి గ్రామానికి నీటి సరఫరా కోసం రామ్ భగత్ అనే వ్యక్తి కెనాల్ వద్దకు వెళ్ళాడు. అయితే కాలువ పక్కనే ఓ బ్యాగులో తొమ్మిదేళ్ళ చిన్నారి బాలిక మృతదేహన్ని కనుగొన్నాడు. ఈ విషయాన్ని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఈ విషయం తెలిసిన వెంటనే సర్దార్ పోలీస్ స్టేషన్ పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకొన్నారు. ఆ పాప మృతదేహన్ని స్వాధీనం చేసుకొన్నారు. అయితే ఆ బాలిక ఎవరనే విషయాన్ని ఇంకా గుర్తించలేదు. అయితే చనిపోయిన బాలికను గుర్తించాలని పోలీసులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
మృతదేహం బాగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. మృతురాలి కుడిచేయిని చేపలు తిని ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. వారం రోజుల క్రితమే ఆ బాలిక మరణించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.