పోలీస్ స్టేషన్ లో జయలలిత మేనకోడలు దీపా రచ్చరచ్చ: డ్రైవర్ కోసం, దాడి కేసులో!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన మద్దతుదారుడిని విడిచిపెట్టాలని చెన్నైలోని మాంబలం పోలీస్ స్టేషన్ లో దీపా జయకుమార్ రచ్చరచ్చ చేశారు. వెంటనే తన కారు డ్రైవర్ ఏవీ. రాజాను విడిచిపెట్టాలని పోలీసులతో దీపా వాగ్వివాదానికి దిగారు.
జయ మేనకోడలు హోదా
జయలలిత మరణించిన తరువాత ఆమె మేనకోడలు హోదాలో రాజకీయాల్లోకి వచ్చిన దీపా జయకుమార్ సొంతంగా ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై అనే రాజకీయ పార్టీని స్థాపించారు. అప్పటి వరకు దీపా కారు డ్రైవర్ గా ఉన్న రాజాకు పార్టీలో ఆమె ఉన్నత స్థాయి పదవి కట్టబెట్టారు.
భర్తను కాదని డ్రైవర్
ఎంజీఆర్ అమ్మ దీపా పేరవైలో కారు డ్రైవర్ రాజాకు మంచి హోదా ఉన్న పదవి ఇచ్చిన దీపా భర్త మాధవన్ ను పక్కన పెట్టారు. డ్రైవర్ రాజాకు దీపా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని ఆవేదన చెందిన మాధవన్ ఇంటి నుంచి వెళ్లిపోయి మరో కొత్త పార్టీ పెట్టుకున్నాడు.
భర్త VSడ్రైవర్
దీపా కారు డ్రైవర్ రాజా తనను చంపేస్తానని బెదిరించాడని, అందరి ముందు బూతులు తిట్టారని ఆరోపిస్తూ మాధవన్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టారు. ఆ సందర్బంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన దీపా ఇద్దరూ రాజీ అయిపోయారని పోలీసులకు చెప్పి కారు డ్రైవర్ రాజా మీద కేసు లేకుండా చేశారు.
దీపా డ్రైవర్ రాజా అరెస్టు
చెన్నైలోని మాంబలం ప్రాంతంలో రమేష్ కుమార్ ఆనే వ్యక్తి ఆటోని రాజా కారుతో ఢీకొన్నాడు. అనంతరం కారు రోడ్డు పక్కన నిలిపిన రాజా ఆటో డ్రైవర్ రమేష్ మీద దాడి చేసి చంపేస్తానని బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఆటో డ్రైవర్ రమేష్ ఫిర్యాదు మేరకు దీపా కారు డ్రైవర్ రాజాను పోలీసులు అరెస్టు చేశారు.
దీపా ఫైటింగ్
తన కారు డ్రైవర్ రాజాను అరెస్టు చేశారని తెలుసుకున్న దీపా పోలీస్ స్టేషన్ కు వెళ్లి వెంటనే అతన్ని వదిలిపెట్టాలని పోలీసులతో మాటల యుద్దానికి దిగారు. ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకే తాను కేసు నమోదు చేసి రాజాను అరెస్టు చేశామని పోలీసులు ఎంత చెప్పినా దీపా మాత్రం పట్టించుకోలేదు. రాజాను వెంటనే విడుదల చెయ్యాలని పోలీస్ స్టేషన్ లో రచ్చరచ్చ చేశారని తమిళ మీడియా వార్తలు ప్రసారం చేసింది.