రజనీకి ఏం తెలుసని రాజకీయాల్లోకి?, 'నడిఘర్'పై ఫోకస్ చేయండి చాలు: దీప
తమిళనాడులో రాజకీయ వ్యవస్థ సక్రమంగా లేదంటున్న రజనీకి.. అసలు రాజకీయాల గురించి ఏం తెలుసుని దీప ప్రశ్నించారు.
చెన్నై: తమిళ రాజకీయమంతా ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ చుట్టే రక్తి కడుతోంది. ఆయన మద్దతుదారులు, వ్యతిరేకులు స్పష్టంగా చీలిపోయినట్లు కనిపిస్తున్న తరుణంలో.. ఎవరెటు వైపు? అన్నది తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఇరు వర్గాలు పోటాపోటీగా అనుకూల-వ్యతిరేక ప్రచారాలను మొదలుపెడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా జయలలిత మేనకోడలు, ఎంజీఆర్ అమ్మ దీప పేరవై పార్టీ నాయకురాలు దీప రజనీ పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. రజనీని పొలిటికల్ ఎంట్రీని ఎద్దేవా చేస్తూ.. సినీ రంగంలోనే బోలేడు సమస్యలున్నాయని, ఆయన వాటిపై ఫోకస్ చేస్తే మంచిదని ఆమె సలహా ఇచ్చారు.
తమిళనాడులో రాజకీయ వ్యవస్థ సక్రమంగా లేదంటున్న రజనీకి.. అసలు రాజకీయాల గురించి ఏం తెలుసుని దీప ప్రశ్నించారు. రాజకీయాల సంగతి పక్కనపెట్టి సినీ పరిశ్రమలోని సమస్యలు, వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. 3వేల మంది ఉన్న నడిఘర్ సంఘంలోనే మూడు వేలకు మించిన సమస్యలున్నాయని, కాబట్టి రజనీ వాటిపై దృష్టి పెట్టడం మంచిదని దీప అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఎంతమంది రజనీని వ్యతిరేకించినా.. తమిళనాడువ్యాప్తంగా ఆయన్ను ఆదరించడానికి అభిమానులు సిద్దంగా ఉన్నారు. వ్యతిరేక శక్తులకు చెక్ పెట్టేందుకు అప్పుడే రంగంలోకి దిగిన రజనీ అభిమానులు.. ఆయన పొలిటికల్ ఎంట్రీని సుగమమం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో వారం రోజుల్లో రజనీ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిచ్చే అవకాశం ఉండటంతో.. ఆయన నిర్ణయం పట్ల రాష్ట్రంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.