జయలలిత మేనకోడలు ఆస్తులివే!: ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న దీప..
జయలలిత మేనకోడలు దీప జయకుమార్ ఆర్కేనగర్ ఉపఎన్నిక కోసం దాఖలు చేసిన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలు పేర్కొన్నారు.
చెన్నై: ఆర్కేనగర్ ఉపఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేసిన జయలలిత మేనకోడలు దీప ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలు పేర్కొన్నారు. మొత్తం ఆస్తులు రూ.3.05కోట్లుగా అఫిడవిట్ లో పొందుపరిచారు. ఇందులో రూ.2కోట్లు స్థిరాస్తులు కాగా, రూ.1.05కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
2016-17 వార్షిక సంవత్సరానికి 5.37లక్షల ఆదాయం వచ్చినట్లు అఫిడవిట్ లో తెలిపారు. అలాగే గతేడాది రూ.17.50లక్షలకు 1600 చదరపు అడుగుల స్థిరాస్తిని కొనుగోలు చేశానని, దీని మార్కెట్ విలువ రూ.2కోట్ల వరకు ఉండవచ్చునని పేర్కొన్నారు. ఆస్తులతో పాటు అప్పుల వివరాలు కూడా తెలియజేశారు.
బ్యాంకుల నుంచి పొందిన రూ.6.15లక్షల రుణాన్ని ఇంకా చెల్లించాల్సి ఉందని, మరో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.70.65లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలిపారు. 2016లో రూ.50,390 వెచ్చించి ఓ స్కూటర్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.వీటితో పాటు 23.80లక్షల విలువ చేసే 821గ్రాముల బంగారం, రూ.172లక్షల విలువ చేసే వెండి, రూ.4లక్షల విలువైన 20కేరట్ వజ్రాలు తన వద్ద ఉన్నట్లు తెలిపారు.
నగదు రూపంలో చేతిలో రూ.3.50లక్షల నగదు ఉందని, అలాగే బ్యాంకు సేవింగ్ ఖాతాలో రూ.1.77లక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం నాడు నామినేషన్ దాఖలు చేసిన దీప జయకుమార్.. అఫిడవిట్ లో ఈ వివరాలు పేర్కొన్నారు. జయలలితకు తానే అసలైన వారసురాలిని అని నిరూపించుకోవడం కోసం దీప జయకుమార్ గత నెల పొలిటకల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై అనే పార్టీ స్థాపించిన ఆమె ఆర్కేనగర్ లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.