పన్నీర్కు షాక్: దీపా యూటర్న్, అమ్మ జయంతి ఎవరికివారే..
పన్నీరు సెల్వంతో నడిచే విషయంలో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ యూటర్న్ తీసుకున్నారు. అన్నాడియంకె శిబిరాలు చీలిపోయి అమ్మ జయంతి జరిపాయి.
చెన్నై: జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు షాక్ ఇచ్చారు. తన సోదరుడు దీపక్ జయకుమార్ తాజా ప్రకటనతో ఆమె తన ఆలోచనను మార్చుకున్నట్లు చెబుతున్నారు. శశికళకు వ్యతిరేకంగా దీపక్ జయకుమార్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
పన్నీరు సెల్వంకు అండగా నిలుస్తారని భావించిన దీపా తన వైఖరిని మార్చుకున్నారు. కానీ పన్నీర్ సెల్వంతో కలిసి నడుస్తారనే ప్రచారానికి దీప జయకుమార్ శుక్రవారం తెర దించారు. తాను పన్నీర్ సెల్వం క్యాంపులో చేరబోనని ఆమె స్పష్టంగా ప్రకటించారు.
ప్రస్తుత అన్నాడియంకె నాయకత్వాన్ని ప్రజలు ఆదరించడం లేదని దీపా జయకుమార్ అభిప్రాయపడ్డారు. అమ్మ ఆశయాలను సాధించేందుకు ప్రజా క్షేత్రంలోకి దిగుతానని తెలిపారు. ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఆమె కొత్త పార్టీ పెట్టడానికే నిర్ణయించుకున్నారు.
అమ్మ జయ జయంతి వేర్వేరుగా...
ఇదిలావుంటే, అన్నాడీఎంకేలోని ఇరు వర్గాలు అమ్మ 69వ జయంతిని వేర్వేరుగా నిర్వహించుకున్నాయి. శుక్రవారం వేర్వేరుగా జయంతి కార్యక్రమాలు నిర్వహించాయి. అన్నాడీఎంకే శశికళ వర్గీయులు, రెబల్ నేత పన్నీర్ సెల్వం వర్గీయలు వేర్వేరుగా అమ్మ జయంతి నిర్వహించారు.
దీపా జయకుమార్ కార్యక్రమం ఇలా..
జయలలిత మేనకోడలు దీపా జయకర్ మెరీనా బీచ్కు వెళ్లి అమ్మ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. చెన్నైలోని ఓ అనాథాశ్రమంలో పిల్లలకు అల్పాహారం అందజేశారు. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మద్దతుదారులు విడిగా జయంతి కార్యక్రమాలు నిర్వహించాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి రాష్ట్రంలో 69 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్దా తుఫాను బారినపడిన ప్రాంతాలకు పచ్చదనం తెచ్చే కార్యక్రమాలనూ చేపట్టారు.
అమ్మకు దినకరన్ నివాళులు...
పళనిస్వామినేతృత్వంలోని అన్నాడియంకె నాయకులు, అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ స్థానిక పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పర్యావరణ మంత్రి, పార్టీ కోశాధికారి దిండిగుల్ సి.శ్రీనివాసన్ ఒక సావనీర్ విడుదల చేశారు, తొలి ప్రతిని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పొల్లాచి వి.జయరామన్ అందుకున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 690 మెడికల్ క్యాంప్స్ను నిర్వహించారు. ఐదు రోజుల పాటు ఈ క్యాంప్లు అందుబాటులో ఉంటాయి.
ఆర్కె నగర్లో పన్నీర్ సెల్వం వర్గం..
పన్నీర్ సెల్వం మద్దతుదారులు జయలలిత నియోజకవర్గమైన ఆర్.కె.నగర్లో సమావేశమై అమ్మ జయంతి జరిపారు. నియోజకవర్గ ప్రజలకు ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు, ప్రెషర్ కుక్కర్లు, ఇతర సామగ్రిని పన్నీర్ సెల్వం శిబిరం అందజేసింది.