పళనిసామి సంచలన నిర్ణయం: పోయెస్ గార్డెన్ లోని జయ బంగ్లా ! దీపా ఫైర్, నువ్వెవరు ?
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన తరువాత చెన్నై చేరుకున్న తమిళనాడు సీఎం పళనిసామి దూకుడు ప్రదర్శిస్తున్నారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి దూకుడుమీద ఉన్నారు. తమిళనాడు అభివృద్ది విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు అభివృద్ది విషయంలో రాజీపడకూడదని అధికారులకు సూచించారు.
శశికళను జైల్లో కలిసిన నటుడు, ఎమ్మెల్యే, 40 నిమిషాలు చర్చ: అప్పుడు రజనీ అండ !
తమిళనాడులో ఇక పాలన మీద మరింత పట్టు బిగించే దిశగా పళనిసామి అడుగులు వేస్తున్నారు. అందుకు అద్దం పట్టే రీతిలో చెన్నైలోని సచివాలయం వేదికగా గంటన్నర పాటు మంత్రులు, అన్ని శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులతో సమావేశం నిర్వహించి పలు విషయాలపై చర్చించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు.
ఢిల్లీ భేటీతో పళనిసామిలో మార్పు !
బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన తరువాత చెన్నై చేరుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాలు, అన్నాడీఎంకేలో కొనసాగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సంచలన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారని తెలిసింది.
సచివాలయంలో మంత్రులు, సీఎస్ తో !
సీఎం పళనిసామి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తమిళనాడు సీఎస్ గిరిజా వైద్యనాథన్ తో సహ అన్ని శాఖలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గోన్నారు. సుమారు గంటన్నపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం పళనిసామి అన్ని శాఖలకు చెందిన అధికారుల నుంచి వివరాలు సేకరించారు.
అసెంబ్లీలో జయలలిత ఫోటో !
విద్యాశాఖలో మార్పులు, రాష్ట్ర పథకాల అమలు, శాఖల వారి విధుల కేటాయింపు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ శత జయంతి ఉత్సవ వేడుకలు, అసెంబ్లీ సమావేశాలు తదితర విషయాలపై సీఎం పళనిసామి చర్చించారు. ఇదే సందర్బంలో అసెంబ్లీలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఫోటో ఏర్పాటు చేసే విషయంలో చర్చ జరిగిందని సమాచారం.
పోయెస్ గార్డెన్ బంగ్లా స్మారక మందిరం !
పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం బంగ్లాను జయలలిత స్మారకమందిరంగా తీర్చిదిద్దాలని పళనిసామి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం తీర్మానించింది. అంతే కాకుండా మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్ది స్మారక చిహ్నం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.
కోడనాడు బంగ్లా, అమ్మ ఆస్తులు !
జయలలితకు చెందిన కోడనాడు బంగ్లాతో సహ ఆమె ఆస్తులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సీఎం పళనిసామి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గం నిర్ణయించింది. జయలలితకు చెందిన ఆస్తుల వ్యవహారాలు చూడటానికి ప్రత్యేక కమిటి వెయ్యాలని చర్చ జరిగిందని సమాచారం.
అధికారులను బయటకు పంపించి !
మంత్రి వర్గ సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న అధికారులు అందరినీ బయటకు పంపించేశారు. తరువాత అర్దగంట పాటు సీఎం తన మంత్రి వర్గ సహచరులతో చర్చించారు. అధికారులను బయటకు పంపించి ఏ విషయంపై సీఎం చర్చలు జరిపారు అనే విషయం బయటకురాలేదు.
మండిపడుతున్న దీపా
పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం జయలలిత స్మాకర మందిరం చెయ్యాలని నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు అంటూ ఆమె మేనకోడలు దీపా మండిపడుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి మా మేనత్త ఇంటి విషయంలో ఎలా జోక్యం చేసుకుంటారని దీపా జయకుమార్ ప్రశ్నిస్తున్నారు.
మా కుటుంబం నిర్ణయంతోనే
పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం జయలలిత స్మారక మందిరం చెయ్యాలా ? వద్దా ? అనే విషయం మా కుటుంబం నిర్ణయం తీసుకుంటుందని దీపా జయకుమార్ అన్నారు. మా కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ప్రభుత్వం నడుచుకోవాలని దీపా డిమాండ్ చేస్తున్నారు. మా మేనత్త ఇంటి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు ? అంటూ దీపా ఓ సందర్బంలో సీఎంను ఉద్దేశించి మాట్లాడారు.
దీపక్ వద్ద జయలలిత వీలునామా !
పోయెస్ గార్డెన్ తో సహ మా మేనత్త ఆస్తులు అన్నింటికి నేను, నా సోదరి దీపా మాత్రమే వారుసులు అని జయలలిత మేనల్లుడు దీపక్ ఇటీవల ప్రకటించారు. జయలలిత రాసిన వీలునామా నా దగ్గరే ఉందని, ఆమె ఆస్తులు అన్నింటికి మేమే వారుసులు అని దీపక్ చెప్పారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఆయన ఎలా స్పందిస్తారో ? అనే విషయం వేచి చూడాలి.