ఈ చాన్స్ మిస్ చేసుకోను: జయలలిత మేనకోడలు దీపా
జయలలిత ప్రాతినిథ్య వహించిన నియోజక వర్గంలో పోటీ చెయ్యడం ఓ ఆదృష్టంగా భావిస్తున్నానని, ఈ అవకాశం వదులుకోనని, మీ ఆశ్వీర్వాదం తనకు కావాలని అమ్మ మేనకోడలు దీపా జయకుమార్ అంటున్నారు.
చెన్నై: తనకు ఇప్పుడు వచ్చిన చక్కటి అవకాశం సద్వినియోగం చేసుకుంటానని, అమ్మ పేరు నిలబెట్టడానికి ఎంతవరకైనా పోరాటం చేస్తానని, ఆర్ కే నగర్ నియోజక వర్గంలోని జయ అభిమానులకు అండగా ఉంటానని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ అంటున్నారు.
జయలలిత మరణంతో ఆర్ కే నగర్ నియోజక వర్గం ఖాళీ కావడంతో ఏప్రిల్ 12వ తేది ఎన్నికల పోలింగ్ జరగనుంది. తాను ఆర్ కే నగర్ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ప్రకటించారు.
మంచి రోజు చూసుకుని నామినేషన్ వెయ్యాలని దీపా నిర్ణయించారు. జయలలిత ప్రాతినిథ్య వహించిన నియోజక వర్గంలో పోటీ చెయ్యడం ఓ ఆదృష్టంగా భావిస్తున్నానని, ఈ అవకాశం వదులుకోనని, మీ ఆశ్వీర్వాదం తనకు కావాలని దీపా జయకుమార్ అంటున్నారు.
జైలుకు వెళ్లకముందు ఆర్ కే నగర్ నుంచి పోటీ చెయ్యాలని శశికళ భావించారు. శశికళ ఇక్కడి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఓడిస్తామని స్థానిక ఓటర్లు హెచ్చరించారు. 1977లో ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీ స్థాపించిన సమయంలో ఆర్ కే నగర్ నియోజక వర్గంలో ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.
తరువాత 1991, 2001, 2006, 2011, 2015, 2016లో ఆర్ కే నగర్ నియోజక వర్గంలో అన్నాడీఎంకే పార్టీ గెలిచింది. జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ కు మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ 1967, 1971, 1989, 1996లో డీఎంకే పార్టీ గెలిచింది.
ఇప్పుడు అవసరం అయితే తాను ఆర్ కే నగర్ నుంచి పోటీ చేస్తానని శశికళ అక్క కుమారుడు టీటీవీ. దినకరన్ స్పష్టం చేశారు. తాను ఆర్ కే నగర్ అభ్యర్థి అంటూ ఆయనే ప్రకటించుకుని సొంత పార్టీ నాయకులకు షాక్ ఇచ్చారు.
స్థానిక ఓటర్లు మాత్రం జయలలితకు నిజమైన వారసురాలు దీపానే, ఆమెను తాము గెలిపిస్తామని అంటున్నారు. ఇప్పుడు పన్నీర్ సెల్వం సైతం ఆర్ కే నగర్ నుంచి అభ్యర్థిని నిలపాలని చర్చలు జరపడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు మాడు వర్గాలుగా చీలిపోయారు. ఎలాగైనా ఆర్ కే నగర్ నియోజక వర్గంలో డీఎంకే విజయం సాధించాలని ఎంకే. స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు.