పోయెస్ గార్డెన్ లోకి జయలలిత మేనల్లుడు దీపక్: అడ్డుకోవాలని శశికళ ఫ్యామిలీ స్కెచ్ !
జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలోకి మకాం మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలోకి మకాం మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది. మంచి ముహూర్తం చూసుకుని పోయెస్ గార్డెన్ లోకి వెళ్లి అక్కడే నివాసం ఉండాలని సిద్దం అవుతున్నారని సమాచారం.
జయలలిత మరణించిన తరువాత ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్ జయకుమార్ తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. మేనత్త నెచ్చెలి శశికళతో కలిసి జయలలిత అంత్యక్రియల్లో పాల్గొన్న దీపక్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
పన్నీర్ సెల్వం రగిలిపోయినా !
అన్నాడీఎంకే పార్టీలో వివాదాలు భగ్గుమన్నా దీపక్ మాత్రం శశికళకు మద్దతు ఇచ్చి ఆమె వైపే ఉన్నారు. దీపక్ సోదరి దీపా జయకుమార్ మాత్రం శశికళ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తరువాత ఆమె కొత్త పార్టీ పెట్టారు. అన్నాడీఎంకే రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వంకు దగ్గర అయ్యినట్లే అయ్యి కొద్ది రోజుల్లోనే దీపా పన్నీర్ వర్గానికి దూరం అయ్యారు.
శశికళ కుటుంబానికి వ్యతిరేకం
శశికళ జైలుకు వెళ్లిన తరువాత టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో జయలలిత మేనల్లుడు దీపక్ తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అప్పటి నుంచి శశికళ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా దీపక్ తన స్వరాన్ని పెంచుతూ వచ్చారు.
మేనత్త ఆస్తులు మావే
మేనత్త జయలలిత ఆస్తులకు నేను, నా సోదరి దీపా మాత్రమే వారసులు అని దీపక్ ప్రకటించారు. జయలలిత రాసిన వీలునామా తన దగ్గరే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం సైతం మాకే చెందుతుందని దీపక్ బాంబు వేశారు.
కళ తప్పిన వేదనిలయం
జయలలిత తన సంపాదనతో ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న పోయెస్ గార్డెన్ కళతప్పింది. వేదనిలయంలో వెలుగు నింపడానికి త్వరలో అక్కడికి మకాం మార్చాలని దీపక్ నిర్ణయించుకున్నారని తెలిసింది. మంచి ముహూర్తం కోసం దీపక్ జయకుమార్ వేచి చూస్తున్నారని సమాచారం.
శశికళ జైలుకు వెళ్లిన తరువాత !
పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం ఒకప్పుడు నిఘా నీడలో, సందడి వాతావరణంలో ఉండేది. ఇప్పుడు జయలలిత లేకపోవడంతో ఆ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. శశికళ జైలుకు వెళ్లిన తరువాత ఆ ప్రాంతంలో ప్రైవేట్ సెక్యూరిటీతో భద్రత ఏర్పాటు చేశారు.
ఇద్దరు మహిళలు, అరుపులు, కేకలు
ప్రస్తుతం జయలలిత ఇంటిలో ఎవ్వరూ లేరు. రాత్రి పూట వేదనిలయం భవనం నుంచి అరుపులు, కేకలు వినిపిస్తున్నాయని దినకరన్ కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రతి రోజు ఉదయం ఇద్దరు మహిళలు (పని మనుషులు) మాత్రం వేదనిలయం పరిసరాలు శుభ్రం చేసి వెళ్తున్నారు.
వెలుగులు నింపేదుకే అక్కడికి దీపక్
పచ్చతోరణం వలే ఒక్కప్పుడు అలరారి ఇప్పుడు కళ తప్పిన వేదనిలయంలో వెలుగులు నింపడానికే దీపక్ అక్కడ నివాసం ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. మంచి ముహూర్తం కోసం దీపక్ వేసి చూస్తున్నారని, తన కుటుంబంతో కలిసి అక్కడ నివాసం ఉండాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
శశికళ ఫ్యామిలీ ప్లాన్ ?
జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో దీపక్ అడుగు పెట్టకుండా అడ్డుకోవడానికి శశికళ కుటుంబ సభ్యులు అడ్డంకులు సృష్టిస్తారా ? అనే విషయం వేచిచూడాలి అంటున్నారు అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు.
ఆరా తీస్తున్న ప్రభుత్వ పెద్దలు ?
జయలలిత మేనల్లుడు దీపక్ పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో అడుగు పెట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ? ఆయనకు ఎవరైనా సహకరిస్తున్నారా ? అంటూ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు (శశికళ వర్గీయులు) గుట్టుచప్పుడు కాకుండా వివరాలు సేకరిస్తున్నారని సమాచారం.