నా వద్ద జయలలిత వీలునామా: బాంబు పేల్చిన మేనల్లుడు, మన్నార్ గుడి హడల్!
జయలలిత ఆస్తులకు సంబంధించిన వీలునామా తన దగ్గర ఉందని ఆమె మేనల్లుడు దీపక్ జయకుమార్ బాంబు పేల్చి మన్నార్ గుడి మాఫియా సభ్యులకు చుక్కలు చూపించాడు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జయలలిత ఆస్తులకు సంబంధించిన వీలునామా తన దగ్గర ఉందని బాంబు పేల్చాడు. జయలలిత ఆస్తులకు వారసులు నేను, నా సోదరి దీపా మాత్రమే అంటూ సంచలన ప్రకటన చేశారు.
శశికళ, దినకరన్ మెడకు జయ కొడనాడు ఎస్టేట్ హత్య కేసు ? విచారణకు సిద్దం!
ఇటీవల జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డును దారుణంగా హత్య చేసిన నిందితులు చోరీ చేసి పరారైనారు. జయలలిత కొడనాడు ఎస్టేట్ లో నగదు, నగల కోసం హత్య జరిగిందనే కోణంలో నీలగిరి జిల్లా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కొడనాడు ఎస్టేట్ హత్య కేసులో పలువురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
హఠాత్తుగా దీపక్ తెరమీదకు !
జయలలిత మేనల్లుడు ఇంత కాలం నోరు విప్పకుండా మౌనంగా ఉన్నారు. అయితే ఒక్క సారిగా తెరమీదకు వచ్చి జయలలిత ఆస్తులకు సంబంధించిన వీలునామా నా దగ్గర ఉందని బాంబు పేల్చడంతో మన్నార్ గుడి మాఫియా సభ్యులు హడలిపోయారు.
జయలలిత ఆస్తుల కోసం హత్య !
జయలలిత కొడనాడు ఎస్టేట్ లో ఆమె ఆస్తుల పత్రాలు, అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన కీలకపత్రాలు ఉన్నాయని, వాటికోసం అక్కడ సెక్యూరిటీ గార్డును హత్య చేసి ఉంటారని ఆరోపణలు వచ్చాయి. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దీపక్ సంచలన ప్రకటన
కొడనాడు ఎస్టేట్ హత్య కేసు విచారణ నేపథ్యంలోనే దీపక్ తెరమీదకు వచ్చాడు. మా అత్త జయలలిత రాసిన వీలునామా తన దగ్గర ఉందని, ఆమె ఆస్తులు అన్నీ నా పేరిట, నా సోదరి దీపా పేరిట రాసి ఉన్నాయని, ఆస్తులు మొత్తం మాకే చెందుతాయని సంచనల ప్రకటన చేశారు.
వీలునామా ప్రకారం ఇవే ఆస్తులు
జయలలిత రాసిన వీలునామా ప్రకారం చెన్నైలోని పోయస్ గార్డెన్ లోని బంగ్లా, చెన్నైలోని పార్సన్ మేరన్ లోని రెండు కార్యాలయాలు, సెయింట్ మేరీస్ లోని నివాసం, కొడనాడు ఎస్టేట్, హైదరాబాద్ లోని ద్రాక్ష తోట తదితర ఆస్తులు అన్నీ మావే అంటూ దీపక్ జయకుమార్ ప్రకటించారు.
ఉలిక్కిపడిన మాన్నార్ గుడి మాఫియా
జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ప్రకటనతో శశికళ వర్గంలోని మన్నార్ గుడి మాఫియా ఉలిక్కిపడింది. ఇంత కాలం జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లో మాకం వేసి ఆ బంగ్లాలో హల్ చల్ చేసిన మన్నార్ గుడి మాఫియా సభ్యులు ఇప్పుడు ఏం చేస్తారు అంటూ తమిళనాడు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
శశికళకు ఓకే, దినకరన్ కు వ్యతిరేకం
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను నియమించడాన్ని అప్పట్లో దీపక్ సమర్థించాడు. అయితే శశికళ జైలుకు వెళ్లిన తరువాత పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ నియమించిన సమయంలో దీపక్ తీవ్రస్థాయిలో వ్యతిరేకించాడు. దినకరన్ కు ఏం అర్హత ఉందని ఆ పదవిలో నియమించారని బహిరంగంగా ప్రశ్నించాడు.
అసలు
జయలలిత రాసిన వీలునామా ఆమె మేనల్లుడు దీపక్ జయకుమార్ దగ్గర ఉందా ? లేక కొడనాడు ఎస్టేట్ హత్య కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఆయనతో ఈ మాటలు శశికళ వర్గం చెప్పించిందా ? అంటూ అన్నాడీఎంకే నాయకుల్లో చర్చ మొదలైయ్యింది.
ఆస్తుల స్వాధీనం కోసం వస్తారా !
తన మేనత్త ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి దీపక్, దీపా జయకుమార్ కచ్చితంగా వస్తారని అమ్మ అభిమానులు అంటున్నారు. వారి దగ్గర వీలునామా ఉంటే చట్టపరంగా ఆస్తులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. జయలలిత ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు దీపక్ సిద్దం అయ్యారని తెలిసింది.
దీపక్, దీపా ఒక్కటి కావాలి
జయలలిత మేనల్లుడు దీపక్, ఆమె మేనకోడలు దీపా జయకుమార్ వేరువేరుగా నివాసం ఉంటున్నారు. కొంత కాలం వీరిద్దరూ ఒకరినోకరు మాట్లాడుకోవడం లేదని సమాచారం. అయితే జయలలిత ఆస్తులు శశికళ వర్గం చేతికి చిక్కకుండా చూడటానికి దీపక్, దీపా ఒక్కటి కావాలని అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు అంటున్నారు.