డ్రగ్స్ కేసు : ఎన్సీబీ ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన దీపికా... తట్టుకోలేక 3 సార్లు ఏడ్చేసింది...
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ను షేక్ చేస్తోంది. బడా నిర్మాతలు,బడా నటుల పేర్లు బయటకు రావడంతో ఎప్పుడు ఎవరి చుట్టూ ఉచ్చు బిగుస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. డ్రగ్స్ లింకులకు సంబంధించి శనివారం(సెప్టెంబర్ 26) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) హీరోయిన్లు దీపికా పదుకొణే,సారా అలీ ఖాన్,శ్రద్దా కపూర్లను విచారించింది. విచారణలో ఎన్సీబీ ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన దీపిక బోరున విలపించినట్లు లీకులు వస్తున్నాయి.
Recommended Video
సడెన్ బ్రేక్.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్తో దీపికా షో వాయిదా.. అదే కారణమా..?
మూడుసార్లు ఏడ్చిన దీపికా...
ఒక సినిమా షూటింగ్ కోసం గోవాలో ఉన్న దీపికా... ఎన్సీబీ విచారణ నిమిత్తం శనివారం భర్త రణ్వీర్ సింగ్తో కలిసి ముంబైకి వచ్చారు. ఉదయం 9.45గం. సమయంలో ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.10.50గం. సమయంలో ఆమె మేనేజర్ కరీష్మా ప్రకాష్ కూడా ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. 2017లో దీపికా అడ్మిన్గా ఉన్న ఓ వాట్సాప్ గ్రూపులో డ్రగ్స్ చాటింగ్కి సంబంధించి అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన దీపికా... మొత్తం 3 సార్లు కన్నీళ్లు పెట్టుకున్నట్లు లీకులు వస్తున్నాయి.
ఎమోషనల్ కార్డు ప్లే చేయవద్దని....
విచారణలో 'ఎమోషనల్ కార్డు' ప్లే చేయవద్దని దీపికా అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో 2017లో తాను అడ్మిన్గా ఉన్న వాట్సాప్ గ్రూపులో డ్రగ్స్ చాట్ను దీపికా అంగీకరించినట్లు లీకులు వస్తున్నాయి. అయితే తాను మాత్రం డ్రగ్స్ తీసుకోవడం లేదా ఇతరులకు సప్లై చేయడం చేయలేదని దీపికా చెప్పినట్లు సమాచారం. దాదాపు ఐదు గంటల పాటు దీపికాను అధికారులు విచారించారు. దీపికా విచారణలో వెల్లడైన విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తాజా విచారణతో అధికారులు సంతృప్తి చెందారా లేక మరోసారి దీపికాను ప్రశ్నిస్తారా అన్నది చూడాలి.
శ్రద్దా,సారా విచారణ ఇలా...
శనివారం మరో హీరోయిన్ శ్రద్దా కపూర్ను కూడా ఎన్సీబీ విచారించింది. ఉదయం 11.45గం. సమయంలో ఆమె ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. శ్రద్దా కూడా తనకు డ్రగ్స్ అలవాటు లేదని విచారణలో అధికారులకు వెల్లడించింది. దాదాపు ఆరు గంటల పాటు ఆమెను ప్రశ్నించిన అధికారులు సాయంత్రం 5.45గం. సమయంలో పంపించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మరో హీరోయిన్ సారా అలీ ఖాన్ను 10.30గంటలకు విచారించాల్సి ఉండగా... దాన్ని 12.30గంటలకు రీషెడ్యూల్ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు సారా ఎన్సీబీ కార్యాలాయానికి చేరుకోగా సాయంత్రం 5.45గంటలకు వరకు అధికారులు ఆమెను విచారించారు. తనకు సిగరెట్ తాగే అలవాటు ఉందని విచారణలో సారా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే డ్రగ్స్ ఆరోపణలను మాత్రం ఖండించినట్లు సమాచారం.
హైకోర్టుకు రకుల్ ప్రీత్...
అంతకుముందు శుక్రవారం(సెప్టెంబర్ 25) హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ను ఎన్సీబీ విచారించిన సంగతి తెలిసిందే. గురువారం ఆమెకు ఎన్సీబీ నోటీసులు జారీ చేయగా... మొదట తనకు నోటీసులు అందలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నోటీసులు అందినట్లు మరో స్టేట్మెంట్ ఇచ్చారు. తాజా ఎన్సీబీ విచారణపై తనకు సంబంధించి ఎటువంటి కథనాలు మీడియాలో ప్రసారం చేయకుండా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా,న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్కు ఆదేశాలివ్వాలని రకుల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ పూర్తయ్యేంతవరకూ డ్రగ్స్ కేసుకు సంబంధించి తనపై ఎటువంటి కథనాలు మీడియాలో రాకుండా చూడాలని కోరారు. ఈ పిటిషన్ వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.