భారత్-పాక్లకు యూకే ప్రధాని థెరిస్సా మే సూచన, 'చైనా కూడా పాక్ వెంట లేదు'
లండన్/న్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితులపై బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే స్పందించారు. ఈ రెండు దేశాల మధ్య గల ఉద్రిక్తతలపై బ్రిటన్ దృష్టి సారించిందని తెలిపారు. మరింత టెన్షన్ వాతావరణం తలెత్తకుండా ఇరువైపులా సంయమనం పాటించాలని థెరిస్సా మే విజ్ఞప్తి చేశారు.
తాము రెండు దేశాలతో నిత్యం చర్చిస్తున్నామని చెప్పారు. ఇరుదేశాలు కూడా చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇతర దేశాలు, ఐక్య రాజ్య సమితితో కలిసి తాము పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
చైనా కూడా పాక్ వెంట నిలబడలేదు: పాక్ మాజీ రాయబారి హక్కానీ
మంగళవారం నాటి భారత దాడుల అనంతరం ఏ ఒక్క దేశం పాకిస్థాన్కు మద్దతుగా నిలవలేదని అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ అన్నారు. చివరికి చైనా కూడా పాక్ వెంట నిలవలేదన్నారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని వారు కోరారని చెప్పారు. ఈ వైఖరి ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తుందన్నారు. ఉగ్రస్థావరాలకు నెలవుగా మారిన దేశాలను ఇక ఏ మాత్రం సహించరని చెప్పారు. ఇది పాకిస్థాన్కు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అన్నారు.
ఇదిలా ఉండగా, ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ పాక్ కవ్వింపు చర్యలు ఆపడం లేదు. తాజాగా జమ్ము కాశ్మీర్లోని పూంచ్ జిల్లా వెంబడి ఉన్న అంతర్జాతీయ సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కృష్ణాఘటి, మెందార్ సెక్టార్లలో కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం కాల్పులకు భారత్ సైన్యం దీటుగా బదులిస్తోంది.