నిర్భయ కలకలం: ఉరి ఎందుకు తీయలేదని నిలదీత, బీబీసీపై ఆగ్రహం
న్యూఢిల్లీ: నిర్భయ డాక్యుమెంటరీ పైన పార్లమెంటులో చర్చ సాగింది. ఈ డాక్యుమెంటరీ పైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం వివరణ ఇచ్చారు. నిర్భయ డాక్యుమెంటరీ పైన విపక్షాలు భగ్గుమన్నాయి. విషయాన్ని సీరియస్గా పరిగణించాలని సభాపతిని కోరాయి. దానికి రాజ్నాథ్ రాజ్యసభలో స్పందించారు.
డాక్యుమెంటరీ పైన విచారణకు ఆదేశించామని చెప్పారు. బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీబీసీకి డాక్యుమెంటరీకి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఒప్పందం ప్రకారం బీబీసీ ప్రతినిధులు వ్యవహరించలేదని చెప్పారు. ఈ డాక్యుమెంటరీ అందరి గుండెల్ని గాయపర్చిందన్నారు.
నివేదిక ఆధారంగా బాధ్యుల పైన చర్యలు ఉంటాయని చెప్పారు. మహిళల పట్ల తమ ప్రభుత్వానికి గౌరవం ఉందని చెప్పారు. ఇంటర్వ్యూ ఫుటేజీని బీబీసీ నుండి తీసేసుకున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ... జైలులో ఉంటున్న నిందితుల ఇంటర్వ్యూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం స్పందన పైన బీఎస్పీ అధినేత్రి, ఎంపీ మాయావతి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యను ఆమె మెచ్చుకున్నారు.
కాగా, మహిళా ఎంపీలు పలువురు రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. నిర్భయ కేసులో నిందితులను ఇంకా ఎందుకు ఉరితీయలేదని ప్రశ్నించారు. ఎంపీ జయాబచ్చన్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం మొసలి కన్నీరు అవసరం లేదని మండిపడ్డారు.
బీబీసీకి నోటీసులు
ఢిల్లీ పోలీసులు బీబీసీకి నోటీసులు ఇచ్చారు. ఒప్పందాన్ని ఉల్లంఘించారనే అభియోగం పైన నోటీసులు ఇచ్చారు.