కేజ్రీవాల్ క్షమాపణల పర్వం: తాజాగా జైట్లీకి, ‘పరువు’ కోసం తప్పడం లేదా?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన క్షమాపణల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ తనపై ఉన్న పరువు నష్టం దావాల నుంచి విముక్తి పొందేందుకు కేజ్రీవాల్ 'సారీ'లు చెప్పక తప్పడం లేదు.
తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. గతంలో కేజ్రీవాల్.. జైట్లీ అవినీతికి పాల్పడ్డారని విమర్శలు చేశారు. దీంతో జైట్లీ ఆయనపై రెండు పరువు నష్టం దావాలు వేశారు. రూ.20కోట్ల నష్టపరిహారం కోరారు. అయితే కేజ్రీవాల్ తాజా క్షమాపణలను జైట్లీ అంగీకరించినట్లు తెలుస్తోంది.
కేజ్రీవాల్పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోనున్నారని తెలిసింది. గత మార్చిలో కేజ్రీవాల్ పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ మజితియాకు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ కుమారుడు అమిత్ సిబల్కు క్షమాపణలు చెప్పారు. గతంలో ఆరోపణలు, విమర్శలు చేసిన కేజ్రీవాల్ తాజాగా వరుసగా అందరికీ క్షమాపణలు చెబుతున్నారు.
Delhi CM Arvind Kejriwal, AAP leaders Sanjay Singh,Ashutosh and Raghav Chadha apologize to Union Finance Minister Arun Jaitley in the defamation case he had filed against them pic.twitter.com/CJFqxVD738
— ANI (@ANI) April 2, 2018
అయితే, కేజ్రీవాల్ 'సారీ'ల పట్ల సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా వాటిని కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే.. కేజ్రీవాల్పై ఇప్పటికే దాదాపు 30 పరువు నష్టం దావాలు ఉన్నాయి. వీటి నుంచి బయటపడాలంటే అదొక్కటే మార్గమని ఆయన భావించినట్లు తెలుస్తోంది.