తివారీకి బెయిల్: రూ.10వేలు చెల్లించాలని ఆదేశం
ముంబై: కేంద్రమంత్రి మనీష్ తివారీని మహారాష్ట్రలోని ముంబై మేజిస్ట్రేట్ కోర్టు రూ. 10 వేలకు బాండు చెల్లించమని ఆదేశించింది. భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వేసిన పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
అక్రమాలు జరిగినట్లు భావిస్తున్న ఆదర్శ్ సొసైటీలో నితిన్ గడ్కరీ బినామీ పేరుతో ఫ్లాట్ కలిగివున్నారని మనీష్ తివారీ ఆరోపించారు. దీనిపై 2010 డిసెంబర్లో నితిన్ గడ్కరీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో తమ ముందు హాజరుకావాల్సిందిగా కోర్టు మనీష్ తివారీకి ఆదేశాలు జారీ చేసింది.
అంతేగాక నితిన్ గడ్కరీకి రూ. 10వేల బాండు చెల్లించాలని తివారీని ఆదేశించింది. కాగా, పరువు నష్టం కేసులో మనీష్ తివారీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్ఎస్ గులానే ఎదుట తన తరపు న్యాయవాది మనోజ్ మోహిత్తోపాటు హాజరైన మనీష్ తివారీ బెయిల్ పత్రాలను దాఖలు చేశారు.