విమర్శిస్తే కేసులా?: జయకు సుప్రీం షాక్, కెప్టెన్కు ఊరట
న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వాన్ని అధికారులను విమర్శించినవారిపై కేసులు పెట్టడం ఓ భయానక పరిస్థితికి దారితీస్తుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
ప్రభుత్వాన్ని, సీఎం జయలలితను విమర్శించారన్న ఆరోపణలతో తమపై తమిళనాడులోని ఓ కోర్టు జారీ చేసిన నాన్బెయిలబుల్ వారెంట్ను సవాలు చేస్తూ డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్, ఆయన భార్య ప్రేమలత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.
ఈ పిటిషన్ను జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్తో కూడిన డివిజన్బెంచ్ గురువారం విచారించింది. విజయకాంత్ దంపతులపై కింది కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను నిలిపివేయాలని ఆదేశించింది. రాజకీయ ప్రత్యర్థులపై పరువునష్టం దావాలను ఒక ఆయుధంగా వినియోగించుకోరాదని ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వానికి హితవు పలికింది.
ప్రజాస్వామ్య వ్యవస్థ ఆకాంక్షలు, భిన్నాభిప్రాయాలు, విమర్శలు, అసమ్మతి, సహనంవంటి ప్రాథమిక అంశాలతో కూడుకున్నదని, తమకు నచ్చని అంశాలను ప్రజలు విమర్శల ద్వారానే వ్యక్తీకరిస్తారని స్పష్టం చేసింది.
విమర్శలపట్ల సహనం వహించకుండా అదే పనిగా ప్రభుత్వం పరువునష్టం కేసులు వేయడం తగదని చెప్పింది. అసమ్మతి గొంతు నొక్కరాదని, ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శించేవారిపై ఐపీసీలోని 499,500 సెక్షన్ల కింద పరువు నష్టం కేసులు పెట్టడం కలవరపరిచే అంశమని వ్యాఖ్యానించింది.
డీఎండీకే అధినేత విజయకాంత్ దంపతులు 2005 నవంబర్లో జయలలిత ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. దీంతో తిరుపూర్ జిల్లా కోర్టులో ప్రభుత్వం వారిపై పరువునష్టం దావా వేయించింది. ఈ కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో స్థానిక కోర్టు విజయకాంత్ దంపతులపై ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీం ధర్మాసనం స్టే విధించింది.