రాజకీయాలు వదిలేసే ఆలోచనలో పారికర్, లేదని వివరణ
న్యూఢిల్లీ: ఓ వయస్సులో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆదివారం నాడు వెల్లడించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించడం గమనార్హం.
గోవా పరిధిలోని మపుసాలో లోకమాన్య మల్టీపర్పస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అరవై ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరూ పదవీ విరమణ గురించి ఆలోచిస్తారని చెప్పారు. తనకు డిసెంబరు 13తో 60 దాటుతాయన్నారు.
ఈ విషయమై రెండు మూడేళ్ల క్రితమే ఆలోచన ప్రారంభించానని చెప్పారు. ఇకపై పెద్ద బాధ్యతలను మోయాలని అనుకోవడం లేదనమి చెప్పారు. కాగా, 2012లో గోవాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మనోహర్ పారికర్ను.. 2014లో ప్రధాని మోడీ తన కేబినెట్లోకి ఆహ్వానించి, కీలకమైన మంత్రి పదవిని అప్పగించారు.
తన దృష్టి ఎప్పుడు గోవా పైన ఉంటుందని మనోహర్ పారికర్ ఈ సందర్భంగా చెప్పారు. గోవా ప్రభుత్వం ఏదైనా తప్పుదారిలో నడిస్తే... దానిని సరైన ట్రాక్లో నడిపిస్తానని ఆయన చెప్పారు. ఈ విషయంలో తాను గోవా ప్రజలకు హామీ ఇస్తున్నానని చెప్పారు.
రాజకీయాల నుంచి తప్పుకోను: పారికర్
తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తాను చెప్పినట్లువచ్చిన వార్తల పైన మనోహర్ పారికర్ సోమవారం స్పందించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదన్నారు. రాజకీయ పదవీ విరమణపై తానేలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.