నటుడు అమీర్ ఖాన్పై పారికర్ ఘాటు వ్యాఖ్యలు
ముంబై: రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పైన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పుణేలో ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఓ నటుడు ఈ తప్పు చేశాడని, అతనికి ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ఆ నటుడు తన భార్య ఈ దేశం నుంచి వెళ్ళిపోదామని చెప్పిందని, విదేశాల్లో జీవిద్దామని అడిగిందని చెప్పాడన్నారు. ఇటువంటి ప్రకటనలు అహంకారపూరితమైనవన్నారు.
ఆ నటుడు ప్రచారకర్తగా ఉన్న ఓ ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీకి కూడా ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. మన దేశం గురించి చెడుగా మాట్లాడే సాహసం ఎందుకు చేయాలని ప్రశ్నించారు. ఈ విధంగా ఎవరైనా మాట్లాడితే గట్టి గుణపాఠం చెప్పాలన్నారు.
దేశభక్తిని, మాతృభూమిని గౌరవించడాన్ని ఇంటి నుంచే నేర్చుకోవాలన్నారు. మీ తల్లిదండ్రులను మీరు అగౌరవంగా చూస్తూ ఉంటే మీ పిల్లలు కూడా మీ పట్ల అలాగే వ్యవహరిస్తారన్నారు. మన ఇల్లు ఎంత చిన్నదైనా, దానిని ఇష్టపడాలని, పెద్ద బంగళాగా మార్చుకోవడానికి ప్రయత్నించాలన్నారు.
గత ఏడాది నవంబరులో అమీర్ ఖాన్ మాట్లాడుతూ తన భార్య ఈ దేశంలో అభద్రత నిండిన వాతావరణంలో తమ పిల్లలకు రక్షణ ఉండదని భయపడుతోందని, విదేశాలకు వెళ్ళిపోవాల్సి వస్తుందేమోనని అంటోందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల పైన పెద్ద దుమారం చెలరేగింది. వీటిని పారికర్ పరోక్షంగా ప్రస్తావించారు.
కాగా, పారికర్ వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా ట్విట్టర్లో స్పందించారు. 'మనోహర్ పారికర్ ఉద్యోగం పాకిస్తాన్ వంటి దేశాల నుంచి దేశాన్ని రక్షించడమా లేక అమీర్ ఖాన్ వంటి వారిని బెదిరించడమా' అని ప్రశ్నించారు.