మొన్న ప్రధాని మోడీ.. ఇక రాజ్నాథ్: ఫస్ట్టైమ్: చైనాపై నిఘా: అనుక్షణం అప్రమత్తంగా
న్యూఢిల్లీ: భారత్ చైనా మధ్య యుద్ధ వాతావరణానికి, ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన లఢక్ సరిహద్దు ప్రాంతాలపై భారత్ నిఘా కొనసాగుతోంది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటోంది. లఢక్ సమీపంలో గాల్వన్ వ్యాలీ సమీపంలోని వాస్తవాధీన రేఖ నుంచి చైనా సైన్యం వెనక్కి తగ్గినప్పటికీ.. దాన్ని తేలిగ్గా తీసుకోవట్లేదు భారత్. చైనా వెనక్కి వేసినప్పటికీ.. మున్ముందు విరుచుకు పడే ప్రమాదాలు లేకపోలేదని భావిస్తోంది. దీనితో- వాస్తవాధీన రేఖ వెంబడి నిఘాను ముమ్మరం చేసింది. కొద్దిరోజుల కిందటే లఢక్లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తు ఉన్న లేహ్ను సందర్శించారు. సరిహద్దుల్లో పహారా కాస్తోన్న సైనికులతో భేటీ అయ్యారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. చైనాతో ఘర్షణ పూరక వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఏర్పాటు చేసిన భద్రతను ఆయన అక్కడే సమీక్షించారు. సైన్యాధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఇక తాజాగా- రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. లఢక్లో పర్యటించబోతున్నారు. శుక్ర, శనివారాల్లో ఆయన లఢక్, శ్రీనగర్లో పర్యటించబోతున్నారు. రక్షణ చర్యలను సమీక్షించబోతున్నారు.
ఆర్మీ మేజర్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణెతో కలిసి రాజ్నాథ్ సింగ్ లఢక్, శ్రీనగర్లల్లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్లు రక్షణమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా రాజ్నాథ్ సింగ్ శ్రీనగర్లో బస చేసే అవకాశం ఉందని సమాచారం. తన పర్యటన సందర్భంగా ఆయన.. ఇప్పటిదాకా భారత్-చైనా లెప్టినెంట్ కమాండర్ స్థాయి అధికారుల మధ్య చోటు చేసుకున్న చర్చలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోనున్నారు. భారత్కు ప్రాతినిథ్యాన్ని వహించిన 14 కార్ప్స్ లెప్టినెంట్ కమాండర్ హర్వీందర్ సింగ్ను రాజ్నాథ్ సింగ్ కలుసుకోనున్నారు.
Recommended Video
ఇప్పటిదాకా చోటు చేసుకున్న చర్చల పురోగతిని అడిగి తెలుసుకోనున్నారు. శ్రీనగర్ పర్యటన సందర్భంగా.. ఇప్పటిదాకా జరిగిన ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాల గురించి రాజ్నాథ్ సింగ్ ఆరా తీస్తారని చెబుతున్నారు. కొద్దిరోజులుగా జమ్మూ కాశ్మీర్లో వరుసగా ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని జవాన్లు కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా వందమందికి పైగా ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను రాజ్నాథ్ సింగ్ తెలుసుకోనున్నారు. దూకుడు కొనసాగించేలా ఆదేశాలను ఇస్తారని అంటున్నారు.