చైనా కిరాతక చర్యపై త్రివిధ దళాధిపతుల ఎంట్రీ: రక్షణమంత్రితో భేటీ: కీలక నిర్ణయం దిశగా?
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న ప్రాణాంతక దాడుల తరువాత దేశ రాజధానిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల్లో తెలంగాణ సూర్యాపేట్కు చెందిన కల్నల్ ర్యాంకు అధికారి బిక్కుమల్ల సంతోష్బాబు సహా 20 మంది జవాన్లు వీరమరణం పొందారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కు చెందిన 43 మంది సైనికులు మరణించారు. ఈ ఘటన చోటు చేసుకున్నప్పటి నుంచీ రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖల్లో కీలక పరిణామాలు నెలకొంటున్నాయి.
భారత జవాన్లు పులులు..అనవసరంగా కెలికారు: అమెరికా మీడియా: నిశితంగా పరిశీలిస్తోన్న వైట్హౌస్
ఆయా శాఖలకు ప్రాతనిథ్యాన్ని వహిస్తోన్న రాజ్నాథ్ సింగ్, సుబ్రహ్మణ్యం జైశంకర్ మంగళవారం రాత్రి వరకూ అధికారులతో కీలక సమావేశాలను నిర్వహించారు. గాల్వన్ వ్యాలీ ఘటన అనంతరం చైనాతో అనుసరించాల్సిన వైఖరిపై ఈ రెండు శాఖల అధికారుల మధ్య చర్చలు కొనసాగాయి. మంగళవారం ఉదయం మరోసారి చర్చలు ఆరంభం అయ్యాయి. ఈ చర్చల పరంపరలో మరో ముందడుగు పడింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో సమావేశం అయ్యారు.
త్రివిధ దళాధిపతులు జనరల్ మనోజ్ ముకుంద్ నరావణె (ఆర్మీ), అడ్మిరల్ కరమ్బీర్ సింగ్ (నౌకాదళం), రాకేష్ కుమార్ బదౌరియా (వైమానిక దళం)లతో రాజ్నాథ్ సింగ్ సమావేశం అయ్యారు. చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఒకవంక వారితో చర్చిస్తూనే విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్తో రాజ్నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. దేశ రాజధానిలో ఈ సమావేశం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సందర్భంగా కీలక నిర్ణయం వెలువడవచ్చని అంటున్నారు.
గాల్వన్ వ్యాలీ ఘటన అనంతరం చైనాతో ఎలాంటి వైఖరిని అనుసరించాలనే విషయంపై ప్రధానంగా వారి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. లఢక్ సెక్టార్ ఈశాన్య ప్రాంతం రెండు దేశాలకు రక్షణపరంగా అత్యంత వ్యూహాత్మకం, సున్నితమైన అంశం కావడం వల్ల అంతే సున్నితంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయం కేంద్ర ప్రభుత్వంలో వ్యక్తమౌతోంది. శాంతియుత వాతావరణం, చర్చల ద్వారా సరిహద్దు వివాదాలకు ముగింపు పలకాలని భావిస్తున్నప్పటికీ.. చైనా అనవసరంగా రెచ్చగొడుతోందనే అభిప్రాయం రక్షణ శాఖ అధికారుల్లో నెలకొంది.
Recommended Video
ఎన్నిసార్లు అడ్డుకున్నా, పలుమార్లు వారించినా.. చైనా సైనికులు భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తూనే ఉన్నారని, పైగా వివాదాస్పద ప్రాంతంలో శాశ్వత కట్టడాలకు కూడా పాల్పడుతున్నారని అంటున్నారు. చైనా దూకుడును అడ్డుకోవడానికి శాశ్వత పరిస్కారాన్ని అన్వేషించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్నాథ్ సింగ్..త్రివిధ దళాధినేతలతో చర్చిస్తున్నారు.