రాజ్నాథ్, అజిత్ ధోవల్కు అమెరికా నుంచి ఫోన్ కాల్: రక్షణ వ్యవహారాలపై ఆరా: చైనా దూకుడుపై
న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య రక్షణ మంత్రిత్వ శాఖాపరమైన సంబంధాల్లో తొలి అడుగు పడింది. అమెరికా రక్షణ శాఖ మంత్రి, జాతీయ సలహాదారు భారత అధికారులతో టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో సుదీర్ఘంగా సంభాషించారు. రెండు దేశాల మధ్య రక్షణపరంగా తీసుకోవాల్సిన చర్యలు, చైనా దుందుడుకు శైలి, ఉగ్రవాద అణచివేత వంటి అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
జో బిడెన్-కమలా హ్యారిస్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత..రక్షణ మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య టెలిఫోనిక్ చర్చలు ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం అమెరికా రక్షణ మంత్రి రిటైర్డ్ జనరల్ లాయిడ్ ఆస్టిన్.. తన కౌంటర్ పార్ట్ రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేశారు. రెండు దేశాల మధ్య రక్షణ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు, సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ విదేశాంగ విధానాలను రూపొందించుకోవాలని సూచించారు.
రెండు దేశాలకు ప్రయోజనం కలిగేలా ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య చైనా వైఖరి ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గత ఏడాది కాలంగా కొనసాగుతోన్న సున్నిత, సమస్యాత్మక అంశాలు తమ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని లాయిడ్ ఆస్టిన్ పేర్కొన్నట్లు చెబుతున్నారు. సామరస్యపూరకంగా వాటిని పరిష్కరించుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం.
Recommended Video
ఇదివరకు డొనాల్డ్ ట్రంప్ చైనీయుల రాకపోకలపై విధించిన ఆంక్షలు ఆ దేశంతో అనుసరించిన విదేశాంగ విధానాల గురించి సమగ్రంగా అధ్యయనం చేశామని, వాటిని పునఃసమీక్షించుకోవడంతో పాటు వీలైతే మరింత కఠిన వైఖరిని అనుసరించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని లాయిడ్ ఆస్టిన్.. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్కు సూచించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. భారత్ సహా ఆసియా పసిఫిక్ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికే తాము ప్రాధాన్యత ఇస్తామని లాయిడ్ ఆస్టిన్ స్పష్టం చేసినట్లు తెలిపింది.