కాగ్ విమర్శించిందని.. మొత్తం నిబంధననే ఎత్తేసిన మోడీ సర్కార్: రక్షణ ఒప్పందాల్లో అనూహ్యం
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించిన రక్షణ మంత్రిత్వ శాఖ కుదుర్చుకునే అంతర్జాతీయ ఒప్పందాల్లో అత్యంత కీలకమైన క్లాజ్ను రద్దు చేసింది. ఇకపై రక్షణ మంత్రిత్వ శాఖ కుదుర్చుకునే గవర్నమెంట్ టు గవర్నమెంట్, ఇంటర్ గవర్నమెంట్ ఒప్పందాల్లో ఆ క్లాజ్ కనిపించదు. ఈ మేరకు రక్షణ కొనుగోళ్ల ప్రక్రియ (డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్-డీఏపీ)-2020లో సవరణలను తీసుకొచ్చింది. అదే- ఆఫ్సెట్ క్లాజ్.
అంతర్జాతీయంగా చైనాకు చెక్ పెట్టేందుకు మోడీ ప్లాన్: డెన్మార్క్ ప్రధానితో దైపాక్షిక చర్చలు
ఆఫ్సెట్ క్లాజ్ అంటే..
రక్షణమంత్రిత్వ శాఖ కొనుగోలు చేసే యుద్ధ పరికరాలు, వాహనాలు, రాఫెల్ వంటి వార్ ఎయిర్క్రాఫ్ట్స్ను విదేశాల నుంచి కొనుగోలు చేయడానికి కుదుర్చుకునే ఒప్పందాల్లో ఆఫ్సెట్ క్లాజ్ తప్పనిసరి. ఈ క్లాజ్ వల్ల కలిగే ఉపయోగం ఏమిటంటే.. 300 కోట్ల రూపాయలు, అంతకుమించిన మొత్తాన్ని వ్యయం చేసి రక్షణ పరికరాలను భారత్కు విక్రయించే అంతర్జాతీయ సంస్థలు లేదా ప్రభుత్వాలు.. కొనుగోలు మొత్తంలో 50 శాతం మేర పెట్టుబడులను తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే- కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు, పరికరాల సాంకేతిక పరిజ్ఙానాన్ని, వాటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ఇతర టెక్నాలజీని డీఆర్డీఓకు బదలాయించాల్సి ఉంటుంది. దీనివల్ల ఆయా పరికారాల మెయింటెనెన్స్ సులభతరమౌతుంది.
బెస్ట్ ఎగ్జాంపుల్.. రాఫెల్
ఉదాహరణకు- రాఫెల్ యుద్ధ విమానాలను భారత్కు విక్రయించిన ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్.. భారత్లో 50 శాతం మేర పెట్టుబడులను పెట్టాల్సి ఉంటుంది. 36 రాఫెల్ విమానాలను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 59 వేల కోట్ల రూపాయలను వ్యయం చేసిన విషయం తెలిసిందే. భారత్తో కుదుర్చుకున్న ఒప్పందంలోని ఆఫ్సెట్ క్లాజ్ ప్రకారం.. ఈ 59 వేల కోట్ల రూపాయల్లో 50 శాతం మేర విలువ చేసే పెట్టుబడులను డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ భారత్లో పెట్టుబడులను పెట్టాల్సి ఉంది.
2005 నుంచి అమల్లో..
తాజాగా రక్షణమంత్రిత్వ శాఖ ఈ ఆఫ్సెట్ క్లాజ్ నిబంధనలను సమూలంగా మార్చేయడం వల్ల.. ఇక భారత్లో ఆ 50 శాతం పెట్టుబడులు పెట్టే అవసరం డస్సాల్ట్ సంస్థకు ఉండదు. 2005లో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం రక్షణ ఒప్పందాల్లో ఆఫ్సెట్ క్లాజును పొందుపరిచింది. పెట్టుబడుల మొత్తాన్ని 30 శాతంగా నమోదు చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కార్.. ఈ 30 శాతాన్ని 50కి పెంచింది.
తప్పు పట్టిన కాగ్..
రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థతో కుదుర్చుకున్న 59 వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఒప్పందాల్లోనూ ఈ క్లాజ్ను చేర్చింది. అక్కడే బెడిసికొట్టింది. ఈ క్లాజ్కు అనుగుణంగా డస్సాల్ట్ సంస్థ.. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు. ఇదే విషయాన్ని కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పు పట్టింది. ఈ నెల 23వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రాఫెల్ రిపోర్టులో పొందుపరిచింది. ఘాటు విమర్శలను గుప్పించింది. కాగ్ రిపోర్ట్పై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగుతోంది.
Recommended Video
ఆఫ్సెట్ క్లాజ్ రద్దు..
ఈ పరిణామాల మధ్య ఆఫ్సెట్ క్లాజ్ను కేంద్ర ప్రభుత్వం సమూలంగా మార్చివేసింది. సవరించిన డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ ప్రకారం.. గవర్నమెంట్ టు గవర్నమెంట్, ఇంటర్ గవర్నమెంట్, సింగిల్ వెండార్ డిఫెన్స్ కొనుగోలు ఒప్పందాల్లో ఇకపై ఆఫ్సెట్ క్లాజ్ ఉండదని రక్షణమంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి, అక్విజిషన్ డైరెక్టర్ జనరల్ అపూర్వ చంద్ర తెలిపారు. సవరించిన డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ విధానాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు.