మరికొన్ని గంటల్లో ఎర్రకోటపై ఎగరనున్న మువ్వన్నెల జెండా, 4 వేల మందికే అనుమతి..
74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరికొన్ని గంటల్లో జరగనున్నాయి. ఢిల్లీలో గల ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 7.30 గంటలకు మోడీ జెండాను ఎగరేస్తారు. ఇందుకోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వైరస్ను దృష్టిలో ఉంచుకొని భౌతిక దూరం, మాస్క్ ధరించడం, అందుబాటులో శానిటైజర్లు, థర్మల్ స్రీనింగ్ ద్వారా కోటలోకి ప్రవేశించే జాగ్రత్తలు తీసుకున్నారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వల్ల అతిథుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఏటా 30 వేల మందితో నిర్వహించే సంబురం. 4 వేల మందికి కుదించారు. అలాగే 350 మంది పోలీసులు మాత్రమే పాల్గొనబొతున్నారు. ఈ సారి విద్యార్థులు కూడా పాల్గొనడం లేదు. కొద్ది మంది అతిథుల కోసం భౌతిక దూరంతో కుర్చీలను ఏర్పాటు చేశారు. విదేశాలకు చెందిన దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు, కరోనాను జయించిన పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులను మాత్రమే వేడుకలకు ఆహ్వానించారు.
ఇద్దరి మధ్య రెండు యార్డుల దూరం ఉండేలా కుర్చీల ఏర్పాటు చేసినట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. కోట సమీపంలో నాలుగు టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆయా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినా తర్వాత లోపలికి అనుమతిస్తారు. అతిథులు కూడా విధిగా మాస్కులు ధరించాలని.. మాస్క్ తీసుకురాకుంటే వారికి అందజేసేందుకు మాస్క్లను కూడా అందుబాటులో ఉంచారు. శానిటైటర్లను కూడా ఉన్నాయని తెలిపారు.
ప్రధాని మోదీ ఉదయం 7.21 గంటలకు ఎర్రకోటకు చేరుకుంటారు. ఉదయం 7.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. తర్వాత ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా వైరస్, చైనా, వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్ తదితర కీలక అంశాలపై మోడీ ప్రసంగించనున్నారు.