కావేరి వివాదం: తమిళనాడుకు నీళ్లిచ్చేది లేదన్న కర్ణాటక!,సుప్రీం ఆదేశాలు బేఖాతరు..
విడుదల చేయడానికి కావేరిలో నీరే లేనప్పుడు సుప్రీం ఆదేశాలను ఎలా పాటించాలని ఎంబీ పాటిల్ ప్రశ్నించారు.
బెంగుళూరు: కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక పట్టించుకోవడం లేదు. తమ ప్రజలకే తాగునీటి ఎద్దడి నెలకొనడంతో నీటిని ఇప్పుడే కిందకు వదిలే ప్రసక్తే లేదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఈ మేరకు కర్ణాటక నీటి వనరుల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఒక ప్రకటన చేశారు. సుప్రీం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే పరిస్థితి లేదని ఆయన వెల్లడించారు. కావేరిలో నీటి నిల్వ తక్కువగా ఉన్న కారణంగా రోజుకు 2 వేల క్యూసెక్కుల నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. తమ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికే కావేరి జలాలు సరిపోవడం లేదని అన్నారు.
మైసూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చడానికి మరో నాలుగు టీఎంసీల నీరు తక్కువగా ఉందని స్పష్టం చేశారు. విడుదల చేయడానికి కావేరిలో నీరే లేనప్పుడు సుప్రీం ఆదేశాలను ఎలా పాటించాలని ఎంబీ పాటిల్ ప్రశ్నించారు.
కాగా, 2007 నాటి కావేరీ జల వివాదాల ట్రైబ్యునల్ తీర్పు మేరకు రోజుకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన సంగతి తెలిసిందే. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడు రిజర్వాయర్లు 80శాతం వరకు ఖాళీగా ఉండటంతో సుప్రీం ఈ తీర్పునిచ్చింది. అదే సమయంలో కర్ణాటకలో 37శాతం వరకు రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
గతేడాది అక్టోబర్ లోను సుప్రీం ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం పక్కనబెట్టింది. ఆ సమయంలో ఆరు రోజుల పాటు రోజుకు 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కోర్టు డిమాండ్ చేసింది.