కాంగ్రెస్లో సెగ: సోనియా మాట్లాడాలని చూసినా ట్రబుల్ షూటర్ నో, రాహుల్ ముందు శివకుమార్ డిమాండ్ల చిట్ట
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తజ్వాలలు కనిపిస్తున్నాయా? అంటే అవుననే అంటున్నారు. పైకి అంతా సవ్యంగానే కనిపిస్తున్నప్పటికీ పార్టీకి చెందిన కీలక నేత, జేడీఎస్ - కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎమ్మెల్యేల రిసార్టు రాజకీయంలో కీలకపాత్ర పోషించిన శివకుమార్ వర్గం అసంతృప్తితో ఉందని తెలుస్తోంది.
చెప్పినట్లే మోడీ గుర్రాన్ని కట్టేశా: కుమారస్వామి, సర్దుకుపోండి.. మన అవసరం: సోనియాగాంధీ
కుమారస్వామి ప్రమాణ స్వీకార సంబరంలో జనతాదళ్ శిబిరం మునిగి తేలగా కాంగ్రెస్ శిబిరం అసంతృప్తితో కనిపిస్తోందట. సీఎం కుమారస్వామితో పాటు ఉప ముఖ్యమంత్రిగా జి పరమేశ్వర్ ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కర్ణాటక వ్యవహారాల బాధ్యుడు వేణుగోపాల్ మంగళవారం రాత్రి ప్రకటించారు. దీంతో పరిస్థితి మారిపోయిందని అంటున్నారు.
డీకే శివకుమార్ వర్గం అసంతృప్తి
డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్ ఆ ప్రకటనతో అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. తమకు ఎలాంటి అసంతృప్తి లేదని శివకుమార్ బుధవారం ప్రకటించారు. కానీ ఆయన వర్గం మాత్రం కొంత అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించడమే కాకుండా ఆపరేషన్ కమల బారిన పడకుండా రక్షించడంలో శివకుమార్ పాత్ర కీలకం.
సోనియా గాంధీ మాట్లాడాలని ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు?
కాంగ్రెస్ తరఫున స్పీకర్, ఉప ముఖ్యమంత్రి పేర్లు ప్రకటించిన అనంతరం డీకే శివకుమార్, ఆయన మద్దతుదారులు మంగళవారం రాత్రి ఎమ్మెల్యేలు బస చేసిన హిల్టన్ హోటల్ నుంచి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం వరకు వేణుగోపాల్తోపాటు పీసీసీ అధ్యక్షులు జి పరమేశ్వర్, ఇతర నాయకులు ఎంత ప్రయత్నించినా వారి ఫోన్లు పలకలేదని తెలుస్తోంది. ఉదయం రాహుల్ గాంధీతోపాటు సోనియా గాంధీ వారితో మాట్లాడాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందట.
రాహుల్ గాంధీ ముందు శివకుమార్ డిమాండ్ల చిట్టా
ఏఐసీసీ నేత ఒకరు వారితో ప్రత్యేకంగా చర్చించారని, ఆ తర్వాతే వారు తిరిగి హోటల్ వచ్చారని అంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ ముందు శివకుమార్ తన డిమాండ్ల చిట్టాను ఉంచారని తెలుస్తోంది. పార్టీలో వొక్కలింగ కీలక నేత. డిప్యూటీ సీఎం పదవి రాకపోయినా కేపీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్నారని తెలుస్తోంది.
కుమారస్వామికి చేయి అందించా, నా సేవలకు ఫలితం దక్కలేదు
దేశమంతా చూస్తుండగా నేను కుమారస్వామికి చేయి అందించానని, సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో దళ్కు ఎంతో సహకరించానని, ఆయన తనను విస్మరించారని భావిస్తున్నానని డీకే శివకుమార్ అన్నారు. తమ సేవలను నిర్లక్ష్యం చేయటం బాధగా అనిపించిందని వ్యాఖ్యానించారు. పరమేశ్వర్ను డిప్యూటీ సీఎంగా నియమించడంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. అందరూ అనుకున్నట్లు నేను ఆటలో బంతిని కాదని, ఆ బంతిని ఆడే ఆటగాడిని అన్నారు. నుదుటిపై రాసి ఉంటేనే తినే భాగ్యం ఉంటుందని, లేదంటే అవకాశం కోసం వేచి చూడాలని, ఇది రాజకీయ సంస్కృతిలో భాగమని, పార్టీ కోసం నేను చేసిన సేవలకు ఫలితం దక్కుతుందనే భావిస్తున్నానని, ఇన్నాళ్లూ ఫలానా పదవి కావాలని నేను అడగలేదని తనను కలసిన విలేకరులతో శివకుమార్ ఆవేదన వెళ్లగక్కినట్లుగా తెలుస్తోంది.